పోలీసుల అదుపులో వైఎస్ షర్మిల- మహిళా దినోత్సవం నాడు..!!
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ధర్నాకు దిగారు. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: ఇవ్వాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు, సీనియర్ నాయకులు మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలియజేస్తోన్నారు. మహిళా సమానత్వం, సాధికారత కోసం ప్రభుత్వాలు మరింత క్రియాశీలకంగా పని చేయాల్సి ఉంటుందని సూచిస్తోన్నారు. మహిళలకు భద్రత, గౌరవం, స్వేచ్ఛ, సాధికారతను కల్పించాల్సి అవసరం ఉందని స్పష్టం చేస్తోన్నారు. మహిళలకు భద్రతను కల్పించిన సమాజం సంతోషమయమౌతుందంటూ వ్యాఖ్యానిస్తోన్నారు.
తెలంగాణలో అధికారంలో ఉన్న భారత్ రాష్ట్ర సమితి ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమైందంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల. రాష్ట్రంలో మహిళలకు ఎలాంటి రక్షణ ఉండట్లేదని, ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. మెడికో ప్రీతి ఉదంతం సహా ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న సంభవించిన ఘాతుకాలే దీనికి నిదర్శనమంటూ షర్మిల నినదించారు.

మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వానికి పరిపాలించే హక్కు లేదంటూ వైఎస్ షర్మిల అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న రాణి రుద్రమ విగ్రహం ముందు ఆందోళనకు దిగారు. నల్ల రిబ్బన్లతో నిరసన తెలియజేశారు. నోటికి నల్ల రిబ్బన్ ను కట్టుకుని నిరసన ప్రదర్శనలో బైఠాయించారు. ఆమెకు మద్దతుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్కడే నిరసనలకు దిగారు.
దీనితో ట్యాంక్ బండ్ పై వాహనాల రాకపోకలకు విఘాతం కలిగింది. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నారు. నిరసన దీక్షను విరమించాల్సిందిగా వైఎస్ షర్మిలకు సూచించారు. దీనికి ఆమె అంగీకరించకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎక్కించారు. ట్యాంక్ బండ్ వద్ద నుంచి నేరుగా బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. కొద్దిసేపటి తరువాత ఆమెను లోటస్ పాండ్ లోని నివాసానికి తీసుకెళ్లారు.
వైఎస్ షర్మిల- కొంతకాలంగా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట్ వద్ద స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరులు, కార్యకర్తలు ఆమెపై దాడికి దిగారు. ఫ్లెక్సీలను తగులబెట్టారు. వాహనాలను ధ్వంసం చేశారు. దీనికి నిరసనగా హైదరాబాద్ లో ప్రగతి భవన్ ను ముట్టడించడానికి బయలుదేరిన షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయా సంఘటనలన్నింటినీ వైఎస్ షర్మిల ప్రస్తావించారు.












Click it and Unblock the Notifications