షర్మిల పాదయాత్రకు బ్రేక్ - డిసెంబర్ 15 తరువాతే : టీఆర్ఎస్ కు పోటీగా - 72 గంటల నిరాహార దీక్ష..!!
వైఎస్ షర్మిల పాదయాత్రకు బ్రేక్ పడింది. తెలంగాణలో పార్టీ స్థాపించి..రాజన్న రాజ్యం లక్ష్యంగా ప్రకటించిన షర్మిల చేవెళ్ల వేదికగా తన పాదయాత్ర ప్రారంభించారు. 22 రోజులుగా షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లాలో మొదలు పెట్టి ప్రస్తుతం నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలంలో కొనసాగిస్తున్నారు. అయితే, ఇప్పుడు తన పాదయాత్రకు విరామం ఇస్తున్నట్లుగా షర్మిల ప్రకటించారు. తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
అమల్లోకి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్
హైదరాబాద్ మినహా మిగిలిన జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీంతో..సభలు.. సమావేశాల నిర్వహణకు అనుమతి లేదు. కోడ్ కారణంగా షర్మిల తన పాదయాత్ర కొనసాగింపు పైన పార్టీ నేతలతో చర్చించారు. వారి సూచనల మేరకు తన పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో దాదాపుగా 14 నెలల పాలుగా నాలుగు వేల కిలీ మీటర్ల మేర యాత్ర చేయాలని షర్మిల నిర్ణయించారు. దీనికి అనుగుణంగా రూట్ మ్యాప్ ఖరారు చేసారు.
పాదయాత్రకు తాత్కాలిక విరామం
ప్రతీ గ్రామం లోనూ పర్యటించి..వారి సమస్యలను తెలుసుకొనేందుకు తన పాదయాత్రలో ప్రాధాన్యత ఇచ్చారు. అక్కడి సమస్యల పైన వారికి హామీలిస్తున్నారు. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇక, తాజా ఎన్నికల కోడ్ డిసెండర్ 15 వరకు కొనసాగనుంది. ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగితే ముందుగానే కోడ్ ఎత్తివేసే అవకాశం ఉంది. అయితే, కోడ్ ఎత్తివేసే వరకూ పాదయాత్రకు విరామం ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే సమయంలో షర్మిల మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వడ్లు కొనుగోలు పైన కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నారు.
టీఆర్ఎస్ కు పోటీగా షర్మిల నిరాహార దీక్ష
రైతులతో కలిసి ఈ నెల 12వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు - రైతులతో కలిసి నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. దీంతో...ఇదే సమయంలో షర్మిల సైతం దీక్ష చేపట్టాలని డిసైడ్ అయ్యారు. రైతు వేదన దీక్ష పేరు తో షర్మిల నిరాహార దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం - రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతుకు అన్యాయం చేస్తున్నాయంటూ నిరసనగా రైతులతో కలిసి దీక్ష చేయనున్నట్లు పార్టీ నేతలు ప్రకటించారు. షర్మిల ప్రారంభించిన పాదయాత్ర లో ఇప్పుడు విరామం ఇవ్వటంతో... ఈ 22 రోజుల యాత్రలో ఎదురైన అనుభవాలను పరిగణలోకి తీసుకొని భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయటానికి షర్మిలకు అవకాశం దొరికింది.