YS Sharmila టార్గెట్ 2023: తెలంగాణలో పాదయాత్ర?: మార్చిలో పార్టీ ప్రకటన..ఎన్నికల గుర్తు
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరో ప్రాంతీయ పార్టీ పుట్టుకుని రావడం ఖాయమైంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా ఆయన కుమార్తె వైఎస్ షర్మిలా..కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతోన్నారు. పార్టీ పేరు సూచనప్రాయంగా బయటికి వచ్చింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా నామకరనం చేసినట్లు తెలుస్తోంది. మార్చిలో పార్టీ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆ వెంటనే- కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో పార్టీ పేరును దరఖాస్తు చేసే ప్రక్రియను ఆరంభిస్తారని చెబుతున్నారు.

వైఎస్సార్ తరహాలోనే..
వైఎస్సార్ తరహాలోనే షర్మిలా కూడా త్వరలోనే తెలంగాణలో పాదయాత్ర నిర్వహించే అవకాశం ఉంది. ఈ ఏడాదే పాదయాత్ర నిర్వహించాలని ఆమె భావిస్తున్నట్లు చెబుతున్నారు. వైఎస్సార్ జయంతి రోజైన జులై 8వ తేదీ తరువాత ఏ క్షణమైనా ఆమె పాదయాత్రను ప్రకటించవచ్చని సమాచారం. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఆకళింపు చేసుకోవడానికి.. పార్టీని గ్రామస్థాయిలోకి తీసుకెళ్లడానికి పాదయాత్ర చేయడమే మేలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో ఆమె పాదయాత్రను నిర్వహించారు. నవ్యాంధ్రలో ఆమె అన్న.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను చేపట్టిన విషయం తెలిసిందే.

పార్టీ రిజిస్ట్రేషన్ తరువాత..
వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరును దాదాపు ఖాయం చేశారని, ఇదే పేరు మీద రిజిస్ట్రేషన్ ప్రక్రియను వచ్చేనెల ఆరంభించనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం అవసరమైన కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల సహకారాన్ని తీసుకోవచ్చని అంటున్నారు. పార్టీ రిజిస్ట్రేషన్, ఎన్నికల గుర్తు ప్రక్రియ పూర్తయిన తరువాతే.. పాదయాత్ర ఉంటుంది. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్నకు అప్పుడే రూపకల్పన చేస్తారనే ప్రచారం తెలంగాణలో విస్తృతంగా వినిపిస్తోంది.

2023 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్..
2023లో తెలంగాణలో నిర్వహించబోయే అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్గా చేసుకుని షర్మిలా పార్టీ తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణను ప్రకటించనున్నారని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల వరకూ ఎలాంటి ఉప ఎన్నికలు గానీ, స్థానిక సంస్థల బరిలో గానీ దిగడానికి పెద్దగా ఇష్టపడట్లేదని తెలుస్తోంది. ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోవాలనే ఆలోచన కూడా ప్రస్తుతానికి లేదనే అంటున్నారు. 117 అసెంబ్లీ స్థానాలు ఉన్న తెలంగాణలో పార్టీ బలం ఎంత ఉందో అంచనా వేసుకోవడానికి నేరుగా 2023 అసెంబ్లీ ఎన్నికలనే లక్ష్యంగా చేసుకున్నారని చెబుతున్నారు.

పార్టీ బలబలాలను బేరీజు వేసుకోవడానికి..
తెలంగాణలో రాజన్నరాజ్యం లేదని షర్మిలా వ్యాఖ్యానించారు. అది తీసుకురావలనేదే తన లక్ష్యమని చెప్పారు. దాన్ని తీసుకుని వస్తామని అన్నారు. రాజన్న రాజ్యం కావాలని, రావాలనే డిమాండ్ కొంతకాలంగా తెలంగాణలో వినిపిస్తోందని షర్మిలా తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అర్ధం చేసుకోవడానికే తాను ఈ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. జిల్లాలవారీగా పార్టీ అభిమానులు, సానుభూతిపరులను కలుస్తానని అన్నారు. పార్టీ బలాన్ని అంచనా వేయడానికి ఈ వరుస భేటీలు ఉపకరిస్తాయని ఆమె అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications