టీటీడీకి 250 ఎకరాల భూమి విరాళం - శ్రీవారు, అమ్మవారికి బంగారు చీరలు..!!
Tirumala: తిరుమల కొండ పైన రద్దీ స్వల్పంగా తగ్గింది. వరుస సెలవులతో నాలుగు రోజులుగా తిరుమల గిరులు భక్తుల రద్దీతో నిండిపోయాయి. భక్తులతో క్యూ కాంప్లెక్స్ లు అన్నీ ప్రస్తుతం నిండి ఉన్నాయి. దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. తిరుమల శ్రీవారికి బెంగుళూరుకు చెందిన భక్తుడు 250 ఎకరాల భూమి విరాళంగా ప్రకటించారు. ఆ భూమిలో తానే స్వయంగా ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆహార ఉత్పత్తులను పండించి టీటీడీకి అప్పగించనున్నారు. అగ్గిపెట్టెలో పట్టే శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారి బంగారు చీరలను మరో భక్తుడు అందించారు.
తిరుమల శ్రీవారి దేవస్థానానికి బెంగుళూరుకు చెందిన మురళీకృష్ణ దాదాపు 250 ఎకరాల భూమిని విరాళంగా అందించేందుకు సిద్దమయ్యారు. సైదాపురం మండలం పోతేగుంటలో ఉన్న ఆ భూములను ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.జవహర్రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. బెంగళూరుకు చెందిన మురళీకృష్ణకు పోతేగుంటలో 90 ఎకరాలు, పోతేగుంటకు పక్కనే ఉన్న తిరుపతి జిల్లా డక్కిలి మండలం దగ్గవోలులో 160 ఎకరాలు కలిపి మొత్తం 250 ఎకరాల బీడు భూములు ఉన్నాయి.

ఆ భూముల్లో ఆయనే స్వయంగా టీటీడీకి అవసరమైన ఆహార ఉత్పత్తులు, పూలు సాగు చేసి అప్పగించేందుకు ముందుకు వచ్చారు.దీంతో, అధికారుల బృందం నీటి వసతి, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. భూముల రికార్డుల మార్పుపై రెవెన్యూ అధికారులకు సూచనలు ఇచ్చారు. ఆ భూముల మ్యాపును పరిశీలించారు. అంతేకాదు.. ఆ భూమిలో తానే స్వయంగా ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆహార ఉత్పత్తులను పండించి టీటీడీకి అప్పగించనున్నారు. తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లకు చెందిన శ్రీ నల్ల విజయ్ ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి అగ్గిపెట్టెలో పట్టే బంగారు చీరలను బహూకరించారు.
తిరుపతి శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి చేతుల మీదుగా వీటిని అందించారు. స్వామి వారికి రూ 45 వేల విలువ చేసే బంగారు చీరను అగ్గిపెట్టెలో పట్టేలా ఆయన తయారు చేయించారు. అలాగే శ్రీ పద్మావతి అమ్మవారికి అగ్గిపెట్టెలో పట్టేలా 5 గ్రాముల బంగారంతో జరీ చీర తయారు చేయించారు.టీటీడీ నిర్మిస్తున్న చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని డిసెంబర్ నాటికి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి అధికారులకు సూచించారు. శ్రీ పద్మావతి హృదయాలయం లో 1300 కు పైగా చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు నిర్వహించటంపై అధికారులను అభినందించారు.












Click it and Unblock the Notifications