టీటీడీ కొత్త పాలక మండలి.. ఆ రోజు నుంచి మనుగడలో
తిరుపతి: ప్రతిష్ఠాత్మక టీటీడీ పాలక మండలికి కొత్త ఛైర్మన్గా తిరుపతి శాసన సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మధ్యాహ్నమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పేరును ఖరారు చేశారు. ప్రస్తుత ఛైర్మన్గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి కాల పరిమితి ఈ నెల 8వ తేదీన ముగియబోతోన్న నేపథ్యంలో- ఆయన స్థానంలో భూమన పేరును ప్రకటించారు.
భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ ఛైర్మన్గా నియమిస్తూ రాత్రికి జీఓ నంబర్ 380 వెలువడింది. ఈ మేరకు రెవెన్యూ (దేవాదయం) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవేన్ ఈ జీఓను జారీ చేశారు. ఈ నెల 8వ తేదీ నుంచి కొత్త పాలక మండలి మనుగడలోకి వస్తుంది. అదే రోజున భూమన.. టీటీడీ ఛైర్మన్గా బాధ్యతలను స్వీకరిస్తారు.

భూమన కరుణాకర్ రెడ్డి.. రెండోసారి టీటీడీ ఛైర్మన్గా అపాయింట్ అయినట్టయింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయన ఒకసారి టీటీడీ ఛైర్మన్గా పని చేశారు. ఆయన హయాంలోనే దళిత గోవిందం.. వంటి కీలక పథకాలను టీటీడీ ప్రవేశపెట్టింది.
2006 నుంచి 2008 వరకు టీటీడీ చైర్మన్గా పని చేశారు భూమన. 2012లో తిరుపతి అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2014 ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. 2019లో మళ్లీ వైసీపీ నుంచి విజయం సాధించారు. ఈ సారి ఎన్నికల్లో తన కుమరుడికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు.
ప్రస్తుతం భూమన కుమారుడు అభినయ్ తిరుపతి డిప్యూటీ మేయర్. 2019లో అధికారంలోకి వచ్చిన తరువాత వరుసగా రెండు టర్మ్ లు టీటీడీ ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డికి అవకాశం ఇచ్చారు జగన్. ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో వైవీసుబ్బారెడ్డి సేవలను పూర్తిగా పార్టీ కోసం వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నారు.
తొలుత టీటీడీ ఛైర్మన్గా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, శిద్దా రాఘవరావు పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ అది సాధ్యపడలేదు. టీటీడీపై ప్రతిపక్షాలు దురుద్దేశపూరకంగా దుష్ప్రచారం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టగలిగే వ్యక్తిగా భూమనేనని జగన్ భావించారు.
శిద్ధా రాఘవరావు, జంగా కృష్ణమూర్తి ఇద్దరూ సమర్ధులే అయినప్పటికీ.. కొత్త వారు కావటం మైనస్ పాయింట్గా భావించారు జగన్. టీటీడీ ఛైర్మన్ వంటి ప్రతిష్ఠాత్మక పదవిపై అనుభవం, బలమైన వాయిస్ ఉన్న వారు ఉంటేనే మేలు అని జగన్ ఉద్దేశం. ఎన్నికలు సమీపిస్తోన్న కొద్దీ టీటీడీపై ప్రతిపక్షాలు తమ దుష్ప్రచారాన్ని మరింత తీవ్రతరం చేసే అవకాశం లేదని, దీన్ని భూమన తిప్పి కొట్టగలరని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications