తిరుమలలో సీజేఐ ఎన్వీ రమణ - సీఎం, మాజీ సీఎం
తిరుపతి: కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఈ తెల్లవారు జామున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారి దర్శనం కోసం గురువారం రాత్రే ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ వారి వెంట ఉన్నారు. రాత్రి పద్మావతి అతిథిగృహంలో బస చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కార్యనిర్వాహణాధికారి ఏవీ ధర్మారెడ్డి ఆహ్వానం పలికారు. ఈ తెల్లవారు జామున సీజేఐ ఎన్వీ రమణ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించారు. సుప్రభాతం, అభిషేక సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ ఉజ్జల్ భూయాన్కు ఆలయ పండితులు వేదాశీర్వచనం పలికారు. టీటీడీ అధికారులు వారికి స్వామివారి శేష వస్త్రం, శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
విజయవాడలో కొత్తగా నిర్మించిన హైకోర్టు భవన సముదాయాలను సీజేఐ ఎన్వీ రమణ ప్రారంభించాల్సి ఉంది. శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కిషోర్ మిశ్రాతో కలిసి ఆయన ఈ భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు. 100 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వం దీన్ని నిర్మించింది. ఇందులో మొత్తంగా 29 కోర్టులు ఏర్పాటవుతాయి. ఇదివరకు చంద్రబాబు ప్రభుత్వం తాత్కాలిక ప్రాతిపదికన ఇప్పుడున్న హైకోర్టు భవనాన్ని నిర్మించిన విషయం తెలిసిందే.
కాగా- కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డ్ సభ్యుడు బీఎస్ యడియూరప్ప కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి సేవల్లో పాల్గొన్నారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వారిని మర్యాదపూరకంగా కలిశారు. శ్రీనివాసుడి విగ్రహాలు, తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామివారి శేష వస్త్రాన్ని వారికి బహూకరించారు. తిరుమలలో కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేకంగా ధర్మసత్రాలను నిర్మిస్తోంది. వాటి నిర్మాణ పనులను పరిశీలించారు.
కాగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మొత్తంగా 25 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉంటోన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. గురువారం నాడు 70,674 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 35,930 మంది తలనీలాలు సమర్పించారు. మొక్కులు చెల్లించుకున్నారు. హుండీ ద్వారా 4.53 కోట్ల రూపాయల ఆదాయం టీటీడీకి అందింది.