శ్రీవారి భక్తులకు శుభవార్త..ఆ దర్శనాలు పునః ప్రారంభం..
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ శుభవార్తను అందించింది. వీఐపీ బ్రేక్ దర్శనానికి నిన్నటి (సోమవారం) నుంచి టీటీడీ తిరిగి సిఫారసు లేఖలను స్వీకరిస్తోంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆగిపోయిన వీఐపీ బ్రేక్ దర్శనాలు పునః ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి ఈ లేఖల్ని అనుమతిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మే 13వ తేదీన ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పాటు శ్రీవారి భక్తుల రద్దీ పెరగడంతో తిరుమల ఆలయ ఈవో ఈసీకి మే 15వ తేదీన లేఖ రాశారు. తిరిగి తిరుమలలో వీఐపీల సిఫార్సు బ్రేక్ టికెట్ల జారీకి అనుమతించాలని ఈసీకి టీటీడి విజ్ఞప్తి చేసింది. టీటీడీ అభ్యర్థనను పరిశీలించిన కేంద్ర ఎన్నికల కమిషన్ సానుకూలంగా స్పందించింది. దీంతో సోమవారం నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు తిరిగి ప్రారంభమయ్యాయి.
ఈ దర్శనాల్లో భాగంగా గతంలో మాదిరిగానే రోజుకు పది వీఐపీ బ్రేక్, పది రూ.300 ఎస్ఈడీ టికెట్లు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఎంపీలకు 12 వీఐపీ బ్రేక్ టిక్కెట్లు, ఎమ్మెల్యేలకు ఆరు చొప్పున వీఐపీ బ్రేక్ టికెట్లను సిఫార్సు లేఖలపై జారీ చేస్తోన్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 22న నృసింహ జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

ప్రతి ఏటా వైశాఖ మాసం స్వాతి నక్షత్రంలో నృసింహ జయంతిని నిర్వహిస్తారు. ఈ జయంతిలో భాగంగా శ్రీ యోగ నరసింహస్వామివారి మూలమూర్తికి ప్రత్యేక అభిషేకం వంటి కార్యక్రమాలు చేస్తారు. వైశాఖ మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీ నరసింహస్వామి వారికి తిరుమల వసంత మండపంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పూజ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని భక్తులు టీవీలో లైవ్లో వీక్షించొచ్చు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. వీటితో పాటు ఈ నెల 22వ తేదిన తిరుమలలోని తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, ఆలయ ప్రాంగణంలో పుష్పాంజలి వంటివి నిర్వహించనున్నారు. ఇక, సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో గోష్టి గానం, హరికథ చేయనున్నారు.












Click it and Unblock the Notifications