టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన జవహర్ రెడ్డి...
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా జవహర్ రెడ్డి శనివారం(అక్టోబర్ 10) బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు,ఉదయం 6గంటలకు అలిపిరి పాదాల మండపం వద్ద నుంచి కాలి నడకన కొండ పైకి చేరుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయానికి చేరుకుని కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా జవహర్ రెడ్డికి వేదపండితులు ఆశీర్వచనం అందించారు. ఆ తర్వాత అన్నమయ్య భవన్లో టీటీడీ ఉన్నతాధికారులతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.
ఇంతకుముందు జవహర్ రెడ్డి రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. కరోనా సంక్షోభ సమయంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ తరుపున కీలకంగా పనిచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి తగ్గుముఖం పట్టడంతో ఆయన్ను ఆ శాఖ నుంచి బదిలీ చేశారు.

Recommended Video
ఇంతకుముందు టీటీడీ ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ను రాష్ట్ర ప్రభుత్వం వైద్య,ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసిన సంగతి తెలిసిందే. నిజానికి టీటీడీ ఈవోగా తెలుగువారు లేదా దక్షిణాది వారిని నియమిస్తుంటారు. కానీ టీడీపీ ప్రభుత్వం ఉత్తరాదికి చెందిన అనిల్ సింఘాల్ను ఈవోగా నియమించడం... వైసీపీ ప్రభుత్వం కూడా ఆయన్నే కొనసాగించడంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. అక్టోబర్ 2న టీటీడీ ఈవో బాధ్యతల నుంచి అనిల్ సింఘాల్ రిలీవ్ అయ్యారు. కొత్త ఈవో బాధ్యతలు స్వీకరించేంతవరకు టీటీడీ ఈవోగా అదనపు ఈవో ధర్మారెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు.












Click it and Unblock the Notifications