తిరుమల, తిరుపతి ఆలయాల్లో విశేష ఉత్సవాలు
తిరుపతి: తిరుమల శ్రీవారి అలయంలో ఆదివారం రాత్రి కార్తీక దీపోత్సవం వైభవంగా జరిగింది. శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు, నివేదనలు పూర్తయిన తరువాత ఈ దీపోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు టీటీడీ అధికారులు. ఇందులో భాగంగా తొలుత శ్రీయోగ నరసింహస్వామి ఆలయానికి ఆనుకుని ఉన్న పరిమళం అర దగ్గర 100 ప్రమిదల్లో నేతి వత్తులతో దీపాలను వెలిగించారు.
అనంతరం ఛత్ర చామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనందనిలయంలో శ్రీవారికి హారతి ఇచ్చారు. గర్భాలయంలో అఖండం, కులశేఖరపడి, రాములవారిమేడ, ద్వారపాలకులు, గరుడాళ్వార్, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణమండపంలో దీపాలను వెలిగించారు.

తాళ్లపాక వారి అర, సభేరా, భాష్యకారుల సన్నిధి, శ్రీయోగ నరసింహస్వామి, విష్వక్సేనులవారు, చందనం అర, వెండివాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద సుమారుగా 100 నేతిజ్యోతులను ఏర్పాటు చేశారు.
అటు తిరుపతిలోని శ్రీకపిలేశ్వరాలయంలో కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని కృత్తికా దీపోత్సవాన్ని టీటీడీ అదికారులు కన్నులపండువగా నిర్వహించారు. స్వామివారి గర్భాలయం, ఆలయ గోపురం, శ్రీకామాక్షి అమ్మవారి ఆలయ గోపురం, ధ్వజస్తంభం పైన దీపారాధన చేశారు. ఈ సందర్భంగా ఊంజల్ మండపంలో శివలింగం, త్రిశూలం ఆకృతిలో ప్రమిదలు వెలిగించారు. అనంతరం జ్వోలాతోరణాన్ని ప్రజ్వలింపజేశారు.
నేడు పౌర్ణమి గరుడ సేవ విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. పౌర్ణమి గరుడ సేవ సందర్భంగా ఈ సాయంత్రం 7 గంటలకు తిరుమలలో మలయప్ప స్వామివారిని ఊరేగిస్తారు. తిరుపతి శ్రీనివాస మంగాపురం, గోవిందరాజస్వామి ఆలయాల్లో సాయంత్రం 6:30 గంటలకు గరుడోత్సవాలను నిర్వహించనున్నారు.
తిరుపతి కోదండరామ స్వామివారి ఆలయంలో ఈ ఉదయం 9గంటలకు అష్టోత్తర శత కళశాభిషేకం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. సాయంత్రం శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారిని పురవీధుల్లో ఊరేగించనున్నారు. కపిలతీర్థంలో కార్తీక పౌర్ణమి వేడుకలు నేడు కూడా కొనసాగుతాయి.












Click it and Unblock the Notifications