పీఎస్ఎల్వీ హాఫ్ సెంచరీ: రిశాట్ ప్రయోగానికి కౌంట్ డౌన్: తిరుమలలో ఇస్రో ఛైర్మన్..!
నెల్లూరు: వరుస ప్రయోగాలతో అంతరిక్షంపై తిరుగులేని ఆధిపత్యాన్ని సాగిస్తోన్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని అందుకోనుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రిశాట్ ప్రయోగానికి సన్నాహాలు పూర్తి చేసింది. మంగళవారం మధ్యాహ్నం ఈ ప్రయోగానికి కౌంట్ డౌన్ ఆరంభమైంది. బుధవారం మధ్యాహ్నం 3:25 నిమిషాలకు రిశాట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లబోతోంది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఒకటో లాంచ్ ప్యాడ్ నుంచి దీన్ని నింగిలోకి పంపించనున్నారు.

పీఎస్ఎల్వీ ప్రయోగాల్లో హాఫ్ సెంచరీ..
ఇస్రో తురుపుముక్క పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) ప్రయోగాల్లో ఇది 50వది. ఇప్పటిదాకా 49 పీఎస్ఎల్వీలను అంతరిక్షంలోకి పంపించింది ఇస్రో. 99 శాతం సక్సెట్ రేటును సాధించినవే. పీఎస్ఎల్వీ సిరీస్ ఒక్క ప్రయోగం మాత్రమే విఫలమైంది. ఆశించిన ఫలితాలను ఇవ్వలేదా ప్రాజెక్టు. రిశాట్-2బీఆర్1 ఉపగ్రహాన్ని మోసుకెళ్లే పీఎస్ఎల్వీ 50వ ప్రయోగం కావడంతో.. ఇస్రో శాస్త్రవేత్తల్లో ఉత్కంఠత నెలకొంది.

పీఎస్ఎల్వీ మోసుకెళ్లే శాటిలైట్లు ఇవే..
మొత్తం 628 కేజీల బరువు ఉన్న వివిధ పేలోడ్లను పీఎస్ఎల్వీ అంతరిక్షంలోకి మెసుకెళ్లబోతోంది. తొమ్మిది విదేశీ పేలోడ్స్ ఉన్నాయి.మల్టీ మిషన్ లెమూర్ ఉపగ్రహాలు-4, టెక్నాలజీ డెమోన్ స్ట్రేషన్ శాటిలైట్-1, ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్-1, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ డచిఫ్యాట్-3, సెర్చ్ అండ్ రెస్క్యూ శాటిలైట్, రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ క్యూపీఎస్-3 చొప్పున పీఎస్ఎల్వీ ద్వారా అంతరిక్షంలోనికి పంపించనున్నారు.

తిరుమలేశుడిని దర్శించుకున్న కే శివన్..
ఈ ప్రయోగం కౌంట్ డౌన్ ఆరంభానికి ముందు ఇస్రో ఛైర్మన్ తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ తెల్లవారు జామున తిరుమలకు చేరుకున్న ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, శ్రీవారి ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. వీఐపీ బ్రేక్ లో ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. రిశాట్ ప్రయోగం నేపథ్యంలో తాను తిరుమలేశుడిని దర్శనానికి వచ్చినట్లు శివన్ తెలిపారు.












Click it and Unblock the Notifications