తిరుమలలో కొత్త వివాదం..అన్యమత ప్రచార ప్రకటనలు: కన్నా..రాజాసింగ్ సీరియస్..!!
తిరుమలలో కొత్త దుమారం మొదలైంది. ఆర్టీసీ బస్సుల టిక్కెట్ల వెనుక అన్యమత ప్రచార ప్రకటనలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ అధికారులే టీటీడీ పవిత్రతను దెబ్బతీయడం ఏంటని భక్తులు మండిపడుతున్నారు. పొరపాటు జరిగిందని ఆర్టీసీ అధికారులు వివరణ ఇచ్చారు. అయినా..ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని టీడీపీ..బీజేపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం ఓ మతాన్ని ప్రచారం చేయటం సరికాదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా హెచ్చరించారు. అదే విధంగా తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే అన్యమత ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజసింగ్ డిమాండ్ చేశారు.
టిక్కెట్ల వెనుక అన్యమత ప్రచారం..
తిరుమలలో ఆర్టీసీ బస్సుల టిక్కెట్ల వెనుక అన్యమత ప్రచార ప్రకటనలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన క్షేత్రంలో ఇలా ఇతర మతాలకు సంబంధించిన ప్రచారం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రాంభగీచ బస్టాండ్లోని కౌంటర్లో గురువారం ఉదయం నుంచి ఇచ్చిన టిక్కెట్ల వెనుక భాగంలో హజ్, జేరుసలేం యాత్రల ప్రకటనలు ముద్రించి ఉన్నాయి. టిక్కెట్ల వెనుక భాగంలోని ప్రకటన చూసి అవాక్కయిన కొందరు భక్తులు ఆర్టీసీ అధికారులను ప్రశ్నించారు. అయితే తిరుమలకు వచ్చే టిక్కెట్ రోజ్పై ఎలాంటి ప్రకటనలు ఉండవని చెప్పిన ఆర్టీసీ డిపో మేనేజర్.. ప్రకటనలు ఉన్న ఐదు పేపర్లు పొరపాటున తిరుమలకు వచ్చాయని చెప్పారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావటంతో దీని పైన టీడీపీతో పాటుగా బీజేపీ నేతలు సీరియస్ అవుతున్నారు. ఇది ముఖ్యమంత్రికి తెలిసే జరుగుతుందా అని నిలదీస్తున్నారు. దీనికి బాధ్యులైన వారి పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

బీజేపీ నేతల సీరియస్..
తిరుమలలో బస్ టికెట్ వెనుక అన్యమత ప్రచారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. టీటీడీలో అన్యమత ప్రచారంపై గతంలోనే ఓ సారి చెప్పామన్నారు. ప్రజాస్వామ్యంలో అన్ని మతాలను గౌరవించాలన్నారు. ప్రభుత్వం ఓ మతాన్ని ప్రచారం చేయడం సరికాదన్నారు. ఎవరి మత విశ్వాసాలు వారికి ఉంటాయన్నారు. ఇదే వ్యవహారం పైన తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం స్పందించారు. క్రైస్తవులకు సంబంధించిన జెరూసలేం గురించి హిందు పుణ్యక్షేత్రాల వద్ద ప్రచారం చేయటం నేరమని అన్నారు. హిందు ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వంపై ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్కు తెలిసే జరుగుతోందా? లేక తెలియకుండా జరుగుతోందా అంటూ ప్రశ్నించారు. దీనిపై సీఎం జగన్ వెంటనే స్పందించి అన్యమత ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజసింగ్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications