తిరుపతిలో రీపోలింగ్-ఈసీకి చంద్రబాబు లేఖ-పెద్దిరెడ్డి బర్తరఫ్కు డిమాండ్
తిరుపతి ఉపఎన్నికలో నకిలీ ఓట్ల వ్యవహారం రాజకీయ పార్టీల్ని కుదిపేస్తోంది. ఇవాళ జరుగుతున్న ఉపఎన్నికల పోలింగ్ కోసం ఇతర ప్రాంతాల నుంచి నకిలీ ఓటర్లను అధికార వైసీపీ రంగంలోకి దింపిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. పలు చోట్ల నకిలీ ఓటర్లను టీడీపీ, బీజేపీ నేతలు పట్టుకోవడం కలకలం రేపింది. దీంతో ఉపఎన్నికలో అక్రమాలపై విపక్ష టీడీపీ, బీజేపీ మండిపడుతున్నాయి. ఇదే క్రమంలో తిరుపతిలో రీపోలింగ్ నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. నకిలీ ఓట్ల వ్యవహారానికి కారణమైన మంత్రి పెద్దిరెడ్డిని బర్తరఫ్ చేయాలని కోరారు.

తిరుపతిలో నకిలీ ఓట్ల రచ్చ
తిరుపతి లోక్సభ స్దానానికి ఇవాళ జరుగుతున్న ఉపఎన్నికను నకిలీ ఓట్లవ్యవహారం కుదిపేస్తోంది. ఇప్పటికే ఓటర్ల జాబితాలో రెండు లక్షల నకిలీ పేర్లను పెట్టారంటూ వైసీపీపై ఆరోపణలు చేస్తున్న విపక్షాలు.. తాజాగా పోలింగ్ రోజున నకిలీలను నేరుగా గుర్తించి పట్టుకోవడంతో ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ ఓ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి మరీ నకిలీ ఓటరును పట్టుకోవడంతో ఈ వ్యవహారంలో ఈసీ తీరుపై తీవ్ర విమర్సలు వెల్లువెత్తాయి.

నకిలీ ఓట్లపై చంద్రబాబు ఫైర్
తిరుపతిలో నకిలీ ఓట్లతో వైసీపీ గెలవాలని చూస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. తిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో అన్ని పార్టీలు పాల్గొన్నాయని, వైసీపీ దుర్మార్గాలను అన్ని పార్టీలు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాయని చంద్రబాబు తెలిపారు. ఉపఎన్నిక కోసం అధికార వైసీపీ వందలాది బస్సులు, కార్లలో జనాన్ని తరలిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓట్లు వేయించేందుకు మహిళలను తీసుకొచ్చారన్నారు. వీరిని తాము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని చంద్రబాబు తెలిపారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల సరిహద్దుల్లో జరగాల్సిన తనిఖీలు జరగలేదని ఆయన ఆరోపించారు. చెక్ పోస్టులు తీసేసి ఇన్ని వేల వాహనాలను పోలీసులు ఎలా అనుమతించారని చంద్రబాబు ప్రశ్నించారు.

తిరుపతిలో రీపోలింగ్కు చంద్రబాబు డిమాండ్
తిరుపతి ఉపఎన్నికలో పట్టపగలే నకిలీ ఓట్ల వ్యవహారం బయటపడిందని, అన్ని పార్టీలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు చేశాయని, కాబట్టి తిరుపతిలో రీపోలింగ్ నిర్వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పదేళ్లు కేంద్ర మంత్రిగా, నాలుగుసార్లు ఎంపీగా ఉన్నవ్యక్తి దొంగ ఓటర్లను పట్టిస్తే పోలీసులు చర్యలు తీసుకోలేదని, ఈసీ కూడా అదే బాటలో వెళ్తుంటే తాము ఎవరికి చెప్పుకోవాలని చంద్రబాబు ప్రశ్నించారు. పరిస్ధితి చూస్తుంటే తిరుపతిలో ఈసీ కూడా విపలమైనట్లే కనిపిస్తోందన్నారు. వైసీపీ అరాచకాల్ని ఆధారాలతో సహా సీఈసీకి అందిస్తామన్నారు. తిరుపతిలో ఎన్నిక రద్దు చేసి కేంద్ర బలగాలతో రీపోలింగ్ పెట్టాలని చంద్రబాబు డీమాండ్ చేశారు

భర్త పేరు తెలియని భార్య, తండ్రి పేరు తెలియని కొడుకులు పరార్
ఉపఎన్నికలో భర్త పేరు తెలియకుండా వచ్చిన భార్యలు, తండ్రి పేరు తెలియకుండా వచ్చిన కుమారులు అడ్డంగా దొరికిపోయారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అనంతరం వారు పారిపోయారన్నారు. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని బీజేపీ నేత శాంతారెడ్డి ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని పరిస్దితి ఉందన్నారు. టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మి దొంగ ఓటర్లను పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే తమ నేతలను అరెస్టు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. పోలీసులు, వాలంటీర్లు, వైసీపీ నాయకులు కుమ్మక్కై ఎన్నికలను ప్రహసనంగా మార్చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ ఓట్లకు కారణమైన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలన్నారు.

పెద్దిరెడ్డిని బర్తరఫ్ చేయాల్సిందే
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పీఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్లోకి వేల మందిని తరలిస్తే పోలీసులు ఎక్కడున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రశ్నించిన టీడీపీ నేతల్ని అక్రమంగా అరెస్టు చేశారన్నారు. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్న జగన్ రెడ్డి కోసం పోలీసులు పనిచేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ అరాచకాలకు సీఈసీ సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘించి మంత్రి పెద్దిరెడ్డి తిరుపతిలో తిరుగుతున్నారని, ప్రెస్మీట్లు పెడుతున్నారని, అలాంటి వ్యక్తి మంత్రిగా ఉండటానికి అనర్హుడని చంద్రబాబు తెలిపారు. తక్షణం ఆయన్ను బర్తరఫ్ చేయాలన్నారు. తిరుపతిలో పోలింగ్ జరుగుతుంటే మంత్రులు ప్రెస్మీట్లు ఎలా పెడుతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. తెల్లవారు జాము నుంచి దొంగ ఓట్లు వేసేందుకు వస్తున్న వారిని అన్నిరాజకీయ పార్టీలు పట్టుకున్నా సెంట్రల్ అబ్జర్వర్లు ఎందుకు పట్టించుకోలేదని చంద్రబాబు నిలదీశారు.












Click it and Unblock the Notifications