తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి తెలంగాణ ఫైర్బ్రాండ్: నాడునిప్పు రాజేసి..!
తిరుపతి: తెలంగాణ రాజకీయాల్లో ఫైర్బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు, కరీంనగర్ లోక్సభ సభ్యుడు బండి సంజయ్.. తిరుపతి ఉప ఎన్నిక ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఒకవంక- సొంత రాష్ట్రంలో నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక వ్యవహారాలను పర్యవేక్షిస్తూనే ఆయన పార్టీ తరఫున తిరుపతికి వస్తారని సమాచారం. ఉప ఎన్నిక పోలింగ్ రోజైన ఏప్రిల్ 17వ తేదీకి వారం రోజుల ముందు ఆయన తిరుపతిలో పర్యటిస్తారని చిత్తూరు జిల్లా బీజేపీ నాయకులు చెబుతున్నారు.
తిరుపతి లోక్సభతో పాటు నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఒకేరోజు పోలింగ్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బండి సంజయ్ నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచార కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడుపుతున్నారు. పార్టీ అభ్యర్థి రవికుమార్ నాయక్ తరఫున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇటీవలే ముగిసిన రెండు శాసన మండలి పట్టభద్ర నియోజకవర్గ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన నేపథ్యంలో.. ఆయన దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. నాగార్జున సాగర్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం శ్రమిస్తున్నారు.
బిజీ షెడ్యూల్లోనూ ఆయన తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి వస్తారని తెలుస్తోంది. పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిల్చున్న రత్నప్రభకు మద్దతుగా ఆయన తిరుపతిలో ఇంటింటి ప్రచారంలో పాల్గొనడంతో పాటు బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారని సమాచారం. రోడ్ షో నిర్వహిస్తారని తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు చేపడతారనేది ఇంకా నిర్ణయించలేదు. పోలింగ్ తేదీకి నాలుగైదు రోజుల ముందు ఆయన పర్యటన ఉండొచ్చని చెబుతున్నారు.
ఇదివరకే బండి సంజయ్.. తిరుపతి ఉప ఎన్నిక వ్యవహారంపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తిరుపతి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఓటర్లు తమకు భగవద్గీత కావాలో.. బైబిల్ కావాలో తేల్చుకోవాలంటూ ఆయన ఇదివరకే నిప్పు రాజేశారు. కాగా- బీజేపీ తరఫున ఆ పార్టీ మిత్రపక్షం జనసేన కూడా తిరుపతిలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. రత్నప్రభను ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం తిరుపతిలో పాదయాత్ర నిర్వహించనున్నారు.