తిరుమలలో కన్నుల పండువగా పరిణయోత్సవాలు
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల తాకిడి నెలకొంది. శ్రీవారి దర్శనం కోసం పోటెత్తుతున్నారు. వేలాదిమంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటోన్నారు. తమ మొక్కులను చెల్లించుకుంటోన్నారు. శుక్రవారం నాడు రికార్డు స్థాయిలో 90 వేల మందికి పైగా దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య ఈ స్థాయిలో ఉండటం ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి.
మొత్తంగా 90,721 మంది శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. వారిలో 50,599 మంది తల నీలాలను సమర్పించారు. హుండీ ద్వారా 3.28 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. సర్వదర్శనం టోకెన్లు ఉన్న వారికి స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లన్నీ నిండిపోవడంతో పాటు ఆక్టోపస్ బిల్డింగ్ వరకు క్యూ లైన్ ఏర్పడింది. క్యూ లైన్లో ఉన్న వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు. అల్పాహారం, పాలు, మంచినీటి వసతిని కల్పించారు.

అదే సమయంలో- తిరుమలలో శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు కన్నుల పండువగా ముగిశాయి. ఈ నెల 17వ తేదీన ఆరంభమైన ఈ ఉత్సవాలు ఉత్సవ మూర్తుల ఊరేగింపుతో పరిపూర్ణం అయ్యాయి. ఆదివారం సాయంత్రం శ్రీవారి ఆలయం నుంచి స్వామివారు గరుడవాహనంపై, దేవేరులు పల్లకీపై ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతీ పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు.
ముందు రెండురోజుల మాదిరే ఎదుర్కోలు, నూతన వస్త్ర సమర్పణ తదితర కల్యాణ వేడుకలు ఘనంగా ముగిసిన తరువాత కొలువు జరిగింది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాలను పారాయణం చేశారు వేద పండితులు. కళాకారులు మంగళకరంగా సంగీత, మేళ, తాళ వాయిద్యాలను ప్రదర్శించారు.
పరిణయోత్పవాలను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 17వ తేదీన రద్దు చేసిన ఆర్జిత సేవలు టీటీడీ అధికారులు నేటి నుంచి పునరుద్ధరించారు. ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను నేటి నుంచి మళ్లీ అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications