శ్రీవారి బంగారు వాకిలి వద్ద కనుల పండుగగా - భక్తులకు అరుదైన అవకాశం..!!
తిరుమలలో నిర్వహించే ఉగాది ఆస్థానంకు విశేష గుర్తింపు ప్రాధాన్యత ఉంది. ఇది భక్తులకు అరుదైన అవకాశం.
Tirumala: ప్రపంచ ప్రసిద్ద పుణ్యక్షేత్రం తిరుమలలో ఉగాది వేడుకలు ప్రారంభమయ్యాయి. ముందు రోజునే స్వామి వారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ తెల్ల వారు జాము నుంచే శ్రీవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభించారు. బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేక పర్వదినం వేళ వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేసారు. అదే సమయంలో ఈ నెల 30,31 తేదీల్లో శ్రీరామ నవమి..శ్రీరామ పట్టాభిషేకం నిర్వహణకు టీటీడీ నిర్ణయించింది.
శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమలలో ప్రతీ ఏటా ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ముంగళవారం శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పటంతో పాటుగా , శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేసారు. స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత సర్వదర్శనం ప్రారంభించారు.

తిరుమలలో ఉగాది ఆస్థానం
ప్రతీ ఏటా ఉగాది నాడు తిరుమలలో ప్రత్యేకంగా ఆస్థానం నిర్వహిస్తారు. ఈ రోజు ఉదయం నుంచి ఉగాది పర్వదిన ప్రత్యేక కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి మరియు విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేసారు. విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు మరియు ఉత్సవ మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఉగాదిని పురస్కరించుకుని ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్సేవలను టీటీడీ రద్దు చేసింది. ఉగాది నాడు పలు ప్రాంతాల్లో పంచాగ శ్రవణం నిర్వహిస్తారు. కానీ, తిరుమలలో నిర్వహించే పంచాగ శ్రవణంకు ప్రత్యకత ఉంది. ఈ శ్రవణం భక్తులు అరుదైన అవకాశంగా భావిస్తారు.

తిరమలలో శ్రీరామ పట్టాభిషేకం
ఈ నెల 30, 31 తేదీల్లో తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామ నవమి, శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించాలని నిర్ణయించారు. 30న ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు రంగనాయకుల మండపంలో శ్రీరామ చంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు హనుమంత వాహనసేవ జరుగుతంది. రాత్రి 9 నుంచి 10 గంటల నడుమ బంగారు వాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానం నిర్వహిస్తారు. 31న రాత్రి 8 నుంచి 9 గంటల నడుమ బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు. శ్రీరామనవమి ఉత్సవాల వేళ సహస్ర దీపాలకంరణ సేవను టీటీడీ రద్దు చేసింది. అదే విధంగా ఉగాది వేళ సేవలు..బ్రేక్ దర్శనాలకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications