శ్రావణమాసంలో తిరుమలలో పండగ శోభ: రద్దీ గ్యారంటీ
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో ఆగస్టు నెలలో శ్రీవారికి నిర్వహించబోయే పండుగలు, విశేష ఉత్సవాల జాబితాను టీటీడీ అధికారులు విడుదల చేశారు. శ్రావణ మాసం మొత్తం తిరుమల పండగ కళను సంతరించుకోనుంది. ఈ సందర్భంగా భక్తుల రద్దీ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆగస్టు 4వ తేదీన శ్రీచక్రత్తాళ్వార్ వర్షతిరునక్షత్రం, శ్రీప్రతివాది భయంకర అణ్ణంగరాచార్య వర్ష తిరునక్షత్రం వేడుకలను టీటీడీ అధికారులు నిర్వహించనున్నారు. 7వ తేదీన ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర, శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేపు కార్యక్రమాలు జరుగనున్నాయి.

ఆగస్టు 9వ తేదీన గరుడ పంచమి పండగను కన్నుల పండువగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీమలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి.. తిరుమాడ వీధుల్లో ఊరేగుతారు. గరుడ వాహనాధీశుడై భక్తులకు దర్శనం ఇస్తారు. 10వ తేదీన కల్కి జయంతిని నిర్వహిస్తారు టీటీడీ అధికారులు. 13వ తేదీన తరిగొండ వెంగమాంబ వర్ధంతి కార్యక్రమాలు ఉంటాయి.
ఆగస్టు 14వ తేదీన శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. 15వ తేదీ నాడు భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. విజిలెన్స్ విభాగం నుంచి గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. అదే రోజున స్మార్త ఏకాదశిని వేడుకగా నిర్వహిస్తారు.
ఆగస్టు 16వ తేదీన వర మహాలక్ష్మీ వ్రతాన్ని సంప్రదాయబద్ధంగా జరుపుతారు. అదే రోజున నారాయణగిరిలో ఛత్రస్థాపనోత్సవాన్ని నిర్వహిస్తారు. 19వ తేదీన శ్రావణ పౌర్ణమి పండగను చేపడతారు. ఆ రోజున పౌర్ణమి గరుడ సేవ, రాఖీ పండుగ హయగ్రీవ జయంతి, విఖనస మహాముని జయంతి వేడుకలను నిర్వహిస్తారు.
ఆగస్టు 20వ తేదీన తిరుమల శ్రీవారు శ్రీ విఖనసాచార్య స్వామి సన్నిధికి వేంచేపు చేస్తారు. అదే రోజున గాయత్రీ మహా మంత్రం జపం నిర్వహిస్తారు. 27వ తేదీన శ్రీకృష్ణాష్టమి పండగను చేపట్టనున్నారు. ఆ సందర్భంగా తిరుమల మహాద్వారం వద్ద శ్రీవారి ఆస్థానాన్ని చేపడతారు. 28వ తేదీన శ్రీవారి శిక్యోత్సవంతో ఈ నెలవారీ వేడుకలు ముగుస్తాయి.












Click it and Unblock the Notifications