ఫైనాన్షియర్లందరూ బీజేపీలోకి: టీడీపీకి నిధుల కొరత: తిరుపతి ఖర్చెవరు భరిస్తారట?
తిరుపతి: తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక వ్యవహారం.. తెలుగుదేశం పార్టీలో కొత్త సమస్యలకు దారి తీస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవంక- అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మరోవంక- ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని భావిస్తోన్న భారతీయ జనతా పార్టీని ఏకకాలంలో ఢీ కొట్టాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది. పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ తోడుగా బీజేపీ తిరుపతి ఉప ఎన్నిక ప్రచారపర్వంలో సై అంటే సై అనే రేంజ్లో దూసుకెళ్తోండగా.. టీడీపీ వెనుకంజలో ఉంటోందనే అభిప్రాయం చిత్తూరు జిల్లా రాజకీయాల్లో వ్యక్తమౌతోంది. ఉప ఎన్నిక ప్రచార ఖర్చును భరించడానికి పేరున్న నేతలెవరూ పెద్దగా ఆసక్తిగా చూపట్లేదని అంటున్నారు.
ఫైనాన్షియర్లందరూ బీజేపీలోకి..
ఇదివరకు ఎలాంటి ఎన్నికలను ఎదుర్కోవాల్సి వచ్చినా, నిధులను మంచినీళ్లలా ఖర్చు పెట్టగలిగే ఆర్థిక స్థోమత టీడీపీలో కనిపించేది. ధారాళంగా ఎన్నికల ఖర్చను భరించే నేతలెవరైనా ఉన్నారంటే.. కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, మాజీమంత్రి పీ నారాయణ, తెలంగాణకు సంబంధించి నామా నాగేశ్వర రావు, కంభంపాటి రామ్మోహన్ రావు వంటి నేతల పేర్లు ఠక్కున గుర్తుకొచ్చేవి. బడా కాంట్రాక్టర్లుగా పేరున్న సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ వంటి నేతలు పార్టీకి పెద్ద ఎత్తున ఫండ్స్ను ఇచ్చేవారు. రాజ్యసభ సీటు కోసం టీజీ వెంకటేష్.. టీడీపీకి వందల కోట్ల రూపాయల పార్టీ ఫండ్ను ఇచ్చారంటూ ఇదివరకు వార్తలు కూడా వచ్చాయి.
ఇప్పుడానేతలందరూ బీజేపీలోకే..
ప్రస్తుతం ఆ నాయకులందరూ బీజేపీలో కొనసాగుతున్నారు. 2019 నాటి సాధారణ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైన అతి కొద్దిరోజుల్లోనే వారంతా పార్టీ ఫిరాయించారు. మూకుమ్మడిగా కాషాయ కండువాను కప్పుకొన్నారు. అయినప్పటికీ- బీజేపీలో కొనసాగుతూ టీడీపీ గళాన్ని వినిపిస్తున్నారనే ఆరోపణలు వారిపై ఉన్నాయి. అదలా వుంచితే- ఎలాంటి ఎన్నికలోనైనా అవసరమైన ఖర్చును భరించడానికి వెనుకాడని ఆ నేతలందరూ బీజేపీలో చేరడంతో టీడీపీ కొత్తగా నిధుల కొరతను ఎదుర్కొంటోందనే వాదనలు జిల్లా రాజకీయాల్లో వినిపిస్తోన్నాయి. తిరుపతి ఉప ఎన్నిక ప్రచార ఖర్చును ఎవరు భరించాలనే ప్రశ్న తలెత్తుతోంది.
ఆసక్తిగా లేని గల్లా కుటుంబం..
తిరుపతికి ఆనుకునే ఉన్న చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన గల్లా అరుణ కుమారి కుటుంబం ఈ ఉప ఎన్నిక పట్ల పెద్దగా ఆసక్తి చూపట్లేదని అంటున్నారు. తిరుపతి లోక్సభ నియోజకవర్గం పరిధిలో చంద్రగిరి అసెంబ్లీ స్థానం లేకపోవడం.. గల్లా జయదేవ్ గుంటూరుకు ప్రాతినిథ్యాన్ని వహిస్తుండటం వంటి కారణాల వల్ల ఆ కుటుంబం ఉప ఎన్నిక ఖర్చును భరించడానికి ముందుకు రావట్లేదని తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థిని పనబాక లక్ష్మీ గెలుపోటముల మాట ఎలా ఉంచినప్పటికీ.. ఈ ఉప ఎన్నికలో ఖర్చును భరించలేమంటూ గల్లా కుటుంబం తన నిస్సహాయతను వ్యక్తం చేసిందని చెబుతున్నారు.
వరుస ఓటములతో డీలా..
2019 నాటి సాధారణ ఎన్నికల తరువాత.. ఎదుర్కొన్న ఎన్నికల్లో టీడీపీ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయిందనేది స్పష్టమౌతోంది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో ఏ జిల్లా స్థాయిలో ఆ జిల్లా నేతలు టీడీపీ తరఫున ధారాళంగా ఖర్చు పెట్టినప్పటికీ.. ఆశించిన ఫలితాలు రాలేదు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్స్వీప్ చేసింది. 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 74 మున్సిపాలిటీలను గెలుచుకుంది. ఆ ఎన్నికలను ఏకపక్షంగా మార్చివేసింది. ఈ పరిస్థితుల్లో తిరుపతి ఉప ఎన్నిక తేడా కొడితే.. మునిగిపోతామనే అభిప్రాయం టీడీపీ నేతల్లో నెలకొని ఉందని చెబుతున్నారు.