కరోనా పేషెంట్ల కోసం టీటీడీ సంచలన నిర్ణయం: అవన్నీ కోవిడ్ కేర్ సెంటర్లుగా
తిరుపతి: రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల తీవ్రత మళ్లీ మొదటికొచ్చింది. ఇదివరకట్లా వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. పలు చోట్ల ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరత నెలకొంది. దీన్ని అధిగమించడానికి జగన్ సర్కార్ యుద్ధ ప్రాతిపదికన చర్యలను తీసుకుంటోంది. కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడంతో పాటు సీనియర్ ఐఎఎస్ అధికారి, ఇదివరకు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉన్న డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డిని దానికి ఛైర్మన్గా నియమించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా పని చేస్తోన్న డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి.. తొలి రోజు కార్యాచరణలోకి దిగారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్, ఇతర అధికారులు, తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందితో అత్యవసర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. టీటీడీ ఆధీనంలో ఉన్న అతిథిగృహాలను కోవిడ్ కేర్ సెంటర్లుగా బదలాయించాలని ఆదేశించారు. తిరుపతి రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న అతిపెద్ద అతిథిగృహం విష్ణునివాసంతో పాటు బస్ స్టేషన్ సమీపంలో ఉన్న శ్రీనివాసం గెస్ట్హౌస్ను కోవిడ్ సర్వీస్ సెంటర్లుగా మార్చాలని సూచించారు.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి నిలయం రెస్ట్హౌస్ను కూడా కోవిడ్ పేషెంట్లకు అవసరమైన వైద్య సేవలను అందించడానికి ఉపయోగించాలని అన్నారు. పేషెంట్ల సంఖ్యకు అనుగుణంగా చిత్తూరు జిల్లాలో టీటీడీ ఆధీనంలో ఉన్న ఇతర ధర్మసత్రాలు, అతిథిగృహాలను కూడా కోవిడ్ సెంటర్లుగా బదలాయించడానికి సమాయాత్తం కావాలని ఆదేశించారు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్)లో ప్రస్తుతం 450 పడకలు అందుబాటులో ఉండగా.. అయిదో అంతస్తు నిర్మాణ పనులను ముమ్మరం చేయడం ద్వారా వాటి సంఖ్యను మరింత పెంచవచ్చని అన్నారు.
అత్యవసర సేవల కోసం శ్రీవేంకటేశ్వర ఆయుర్వేద ఆసుపత్రి పడకలను కూడా వినియోగించుకోవాలని చెప్పారు. వైద్యారోగ్య శాఖ అధికారులు మంగళవారం సాయంత్రం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. చిత్తూరు జిల్లాలో ఒక్కరోజు వ్యవధిలో 1063 కరోనా కేసులు రికార్డయ్యాయి. చిత్తూరు జిల్లాలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య లక్షను దాటేసింది. ఇప్పటిదాకా 1,02,499 కేసులు నమోదయ్యాయి. ఇందులో 92,549 మంది డిశ్చార్జ్ అయ్యారు. 927 మంది మరణించారు. 9,023 యాక్టివ్ కేసులక్కడ కొనసాగుతున్నాయి.