1 నుంచి టీటీడీ సర్వదర్శన టైంస్లాట్ టోకెన్లు జారీ: వీఐపీ బ్రేక్ దర్శన సమంలో మార్పులు
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) మరో ప్రయోగానికి సిద్ధమైంది. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో మార్పులు చేయాలని నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శన సమయాన్ని మారుస్తున్నట్లు తెలిపింది.

రూ. 54 లక్షలతో టీటీడీ పార్కింగ్ కేంద్రం
తిరుపతి అలిపిరి వద్ద టీటీడీ ఉద్యోగులకు రూ. 54 లక్షలతో నిర్మించిన ద్విచక్ర వాహనాల పార్కింగ్ కేంద్రాన్ని ఈవో ధర్మారెడ్డితో కలిసి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ పాలక మండలి సభ్యుడు అశోక్ కుమార్, జేఈవో సదాభార్గవి పాల్గొన్నారు. అనంతరం తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి పాల్గొని మాట్లాడారు.

నవంబర్ 1 నుంచి టీటీడీ సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు
నవంబర్ 1 నుంచి తిరుపతిలో సర్వదర్శన టైంస్లాట్ దర్శన టోకెన్లు జారీ చేస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిలో మూడు ప్రదేశాల్లో సర్వదర్శన టికెట్లు జారీ చేస్తామని తెలిపారు. రోజూ 20 వేల నుంచి 25 వేల సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తామన్నారు. మంగళ, గురు, శుక్రవారాల్లో 15వేల టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు. టికెట్లు లేని భక్తులు వైకుంఠం క్యాకాంప్లెక్స్ ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చని తెలిపారు.

టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో మార్పులు
ఇక వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో మార్పులు చేయాలని నిర్ణయించినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. డిసెంబర్ 1 నుంచి ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శన సమయాన్ని మారుస్తామన్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తామన్నారు. క్షురకులను నిఘా సిబ్బంది ఇబ్బంది పెట్టలేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
తిరుమలలో నిఘా విభాగం ఉండేది అవినీతిని అరికట్టడానికేనని స్పష్టం చేశారు. క్షురకుల ధర్నా వల్ల చాలా మంది ఇబ్బందిపడ్డారన్నారు. భక్తులను ఇబ్బందికి గురిచేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. క్షరకులకు ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి తేవాలని టీటీడీ ఈవో కోరారు.












Click it and Unblock the Notifications