పరిపూర్ణా కామెంట్స్పై భగ్గుమన్న టీటీడీ.. అలాంటిదేం లేదని స్పష్టీకరణ
తిరుమల శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలను రద్దు చేశారనే కామెంట్స్ దుమారం రేపాయిం. వేసవిలో భక్తులకు సరైన ఏర్పాట్లు చేయలేదని శ్రీపీఠం పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానంద స్వామి కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీటీడీ స్పందించింది. మీడియాలో ప్రసారమైన కథనాలను టీటీడీ తీవ్రంగా ఖండిస్తూ, భక్తులకు వాస్తవ వివరాలను తెలియజేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో నిత్యం నిర్వహించే ఆర్జిత సేవలు, కొన్ని విశేషమైన సందర్భాలలో 'ఏకాంత తిరుమంజనం'తో సహా సంవత్సరానికి 450 సార్లు ఉత్సవమూర్తులకు 'అభిషేకాలు' జరుగుతాయి.
రోజువారీ వసంతోత్సవం, వారపు విశేష పూజ మరియు సహస్ర కలశాభిషేకం మాత్రమే 415 సార్లు నిర్వహించేవారు. ఏడాది పొడుగునా నిర్వహిస్తున్న అభిషేకాల వల్ల పురాతనమైన ఉత్సవ మూర్తుల విగ్రహాలకు ఎక్కువగా అరుగుదల ఏర్పడుతుందని భావించిన ఆలయ ప్రధాన అర్చకులు, జీయంగార్లు అభిషేకాలతో ఇమిడియున్న సహస్ర కలశాభిషేకం, విశేష పూజ, వసంతోత్సవం లాంటి ఆర్జిత సేవలను రద్దు చేసి, వార్షిక వసంతోత్సవాలతో పాటు సంవత్సరానికోసారి మాత్రమే సహస్ర కలశాభిషేకాన్ని సర్కారుగా నిర్వహించాలని తద్వారా విగ్రహాలను అరుదుగుదల నుంచి కాపాడవచ్చని సూచించారు.
జియ్యంగార్లు, ప్రధాన అర్చకుల సలహా మేరకు ఈ సేవలను రద్దు చేశారు. విగ్రహాలు పూర్తిగా అరిగిపోయి వాటి స్థానంలో కొత్త విగ్రహాలను తయారు చేయాల్సి వస్తే పాత విగ్రహాన్ని కరిగించి అదే లోహాన్ని తిరిగి కొత్త విగ్రహాల తయారీకి వాడాల్సి ఉంటుంది. ఇది శ్రమతో, సమయంతో కూడిన పనే కాకుండా అరుదైన పురాతన విగ్రహాలను కోల్పోవాల్సి వస్తుంది. 'అభిషేకాల' వల్ల ఉత్సవమూర్తులు త్వరగా అరిగిపోతుండటంతో 1989లో టీటీడీ వార్షిక జ్యేష్టాభిషేకం ప్రవేశపెట్టింది. ప్రతి సోమవారం నిర్వహించే విశేష పూజను 1991లో ప్రవేశపెట్టారు.
ఇప్పుడే కాదు 2019లో ఈ అంశం చర్చకు వచ్చిన సమయంలో పంచలోహ విగ్రహాలకు తరచూ నిర్వహించే అభిషేకాలను నిలిపివేయాలనే జీయంగార్లు మరియు ప్రధాన అర్చకులు, అర్చకుల సూచనల మేరకు టీటీడీ ఈ సేవలను రద్దు చేసింది. టీటీడీ శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామితో పాటు ఈ విషయాన్ని పరిశీలించడానికి ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ కూడా ఉత్సవమూర్తులు అరుగుదలకు గురికాకుండా రక్షించాల్సిన అవసరం ఉందని భావించిన విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.