ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు - రేపు టికెట్ల కోటా విడుదల..!!
Tirumala: తిరుమలలో రద్దీ పెరుగుతోంది. నడక మార్గాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. టిటిడి షెడ్యూల్ ప్రకారం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా సెప్టెంబరు నెల కోటాను జూన్ 19న విడుదల చేయనుంది. అధికమాసం సందర్భంగా ఈ ఏడాది తిరుమల శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన కసరత్తును టీటీడీ ప్రారంభించింది.
రెండు బ్రహ్మోత్సవాలు:అధికమాసం సందర్భంగా ఈ ఏడాది తిరుమల శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తారు.

2020లో అధికమాసం వచ్చిన నేపథ్యంలో కొవిడ్ కారణంగా రెండు బ్రహ్మోత్సవాలను టీటీడీ ఏకాంతంగానే నిర్వహించింది. ఆ తర్వాత ఈ ఏడాది అధికమాసం రావడంతో రెండు బ్రహ్మోత్సవాలను భక్తుల మధ్య అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు. వీటికి సంబంధించి టీటీడీ అధికారులు కసరత్తు ప్రారంభించారు. సోమవారం జరిగే టీటీడీ బోర్డు సమావేశంలో బ్రహ్మోత్సవాల నిర్వహణ పైన చర్చించనున్నారు.
రేపటి నుంచి టికెట్ల కోటా విడుదల:సెప్టెంబరు నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం జూన్ 19వ తేదీ ఉదయం 10 గంటల నుండి 21వ తేదీ వరకు ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు.
లక్కీడిప్ లో టికెట్లు పొందిన వాళ్లు సొమ్ము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. భక్తులు https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో వీటిని బుక్ చేసుకోవచ్చు. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను జూన్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. సెప్టెంబర్ నెల కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవ వర్చువల్ సేవల కోటాను, అదేవిధంగా వాటికి సంబంధించిన దర్శన టికెట్ల కోటాను జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
తిరుమల కొండ పైన రద్దీ:సెప్టెంబర్ నెల ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూన్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. శ్రీవారి ఆలయంలో ఆగస్టు 27 నుంచి 29వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాల సేవా టికెట్ల కోటాను జూన్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
శ్రీవారి ఆలయం, మాడవీధులు, అన్నప్రసాదభవనం, లడ్డూకౌంటర్, అఖిలాండం, బస్టాండ్ ప్రాంతాలు రద్దీగా మారాయి. వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని కంపార్లుమెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయి క్యూలైన్ శ్రీకృష్ణతేజ విశ్రాంతిభవనం వరకు వ్యాపించింది. వీరికి దాదాపు 24 గంటల దర్శన సమయం పడుతోంది. టైంస్లాట్ టికెట్లు, టోకెన్లున్న భక్తులకు మూడు గంటల దర్శన సమయం పడుతోంది.దివ్యదర్శన టోకెన్ల కోసం భక్తులు క్యూలైన్లలో బారులుతీరారు.












Click it and Unblock the Notifications