శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ ఈవో
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం నాడు 84,173 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 32,519 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.25 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 14 నుంచి 16 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, పాలు, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

భక్తుల తాకిడి నెలకొన్న నేపథ్యంలో వారికి అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకోవడానికి టీటీడీ కార్యనిర్వాహణాధికారి జే శ్యామలరావు క్షేత్రస్థాయిలో పర్యటించారు. కంపార్ట్మెంట్లు, టికెట్ కౌంటర్లు, అతిథి భవనాలను పరిశీలించారు. భక్తులతో నేరుగా మాట్లాడారు. వసతుల గురించి ఆరా తీశారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2ను సందర్శించారాయన. భక్తులను దర్శనానికి అనుమతించే సమయంలో కంపార్ట్మెంట్ల గేట్లు తెరవడం, అక్కడి పారిశుద్ధ్య చర్యల గురించి ఆరా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు.. తమకు అందుతున్న సౌకర్యాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.
గోకులం విశ్రాంతి భవనంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా భక్తులకు జారీ చేస్తోన్న తాత్కాలిక టికెట్ల కౌంటర్లను శ్యామలరావు పరిశీలించారు. శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు మరింత సౌకర్యవంతంగా టికెట్లు జారీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా శ్రీవాణి భక్తుల కోసం శాశ్వత టికెట్ల జారీ కేంద్రాన్ని నిర్మించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
దీనికోసం గోకులం విశ్రాంతి భవనం వెనుక వైపు ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. అక్కడ శాశ్వత టికెట్ల జారీ కేంద్రాన్ని నిర్మించడానికి అవసరమైన చర్యలను తీసుకుంటామని పేర్కొన్నారు. అప్పటి వరకు శ్రీవాణి ట్రస్ట్ భక్తుల రద్దీని నివారించడానికి ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలికంగా మరో కౌంటర్, డీఎఫ్ఓ కార్యాలయంలో పూర్తి స్థాయికౌంటర్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
డీఎఫ్ఓ కార్యాలయంలో టికెట్ కౌంటర్లు, 200 మంది వరకు భక్తులు వేచి ఉండేందుకు వీలుగా సీటింగ్, పార్కింగ్, మరుగుదొడ్లు తదితర ఏర్పాట్లు చేయాలని శ్యామలరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలు, తిరుమలనంబి ఆలయం, బయోమెట్రిక్ పనీతీరును పరిశీలించారు.












Click it and Unblock the Notifications