తిరుమలలో ఉగాది.. పంచాంగ శ్రవణం.. ఆస్థానం: ఘనంగా తిరుమంజనం: భక్తులకు పరిస్థితేంటీ?
తిరుపతి: పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమల ప్రస్తుతం నిర్మానుష్యంగా మారింది. భక్తుల కోసం శ్రీవారి దర్శనాన్ని నిలిపి వేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నియంత్రించడంలో భాగంగా భక్తులు ఎవ్వరినీ కొండకు రానివ్వట్లేదు. వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఈ పరిస్థితుల్లో తెలుగు వారి ప్రధాన పండుగ శార్వరి నామ ఉగాది వేడుకల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమౌతూ వచ్చాయి. ఉగాది వేడుకలను నిర్వహిస్తారా?, పంచాంగ శ్రవణం ఉంటుందా? లేదా సందేహాలు ఏర్పడ్డాయి.

భక్తులు రావొద్దంటూ.. విజ్ఙప్తి
వాటన్నింటికీ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెరదించారు. తిరుమలలో యధాతథంగా ఉగాది వేడుకలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు మాత్రం ప్రవేశం లేదు. ఉగాది వేడుకల్లో గానీ, పంచాంగ శ్రవణంలో గానీ, ఉగాది ఆస్థానంలో గానీ పాల్గొనడానికి భక్తులు ఎవరూ తిరుమలకు రావొద్దని అధికారులు సూచించారు. ఈ నెల 31వ తేదీ వరకు ఆంక్షలు కొనసాగుతాయని, భక్తుల రాకపోకలపై నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు.

కోయిల్ అళ్వార్ తిరుమంజనం..
ఇందులో భాగంగా.. మంగళవారం ఆలయంలో కోయిల్ అళ్వార్ తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆనంద నిలయం సహా, ఆలయం ప్రాంగణాన్ని శుద్ధి చేశారు. ప్రతి సంవత్సరం తెలుగు సంవత్సరాది ముందు రోజు కోయిల్ అళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. అదే సంప్రదాయాన్ని ఈ సారి కూడా కొనసాగించారు. సంప్రదాయబద్ధంగా తిరుమంజనాన్ని నిర్వహించారు.

ఉగాదికి ముందునాడు..
ఉగాదితో సహా సంవత్సరంలో నాలుగుసార్లు తిరుమంజనాన్ని నిర్వహిస్తారు టీటీడీ అధికారులు ఉగాది పండుగకు ముందు రోజు, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ తెల్లవారు జామున 6 గంటలకు టీటీడీ అర్చకులు కోయిల్ అళ్వార్ తిరుమంజనం ప్రారంభించారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు సుగంధ ద్రవ్యాలను మిళితం చేసిన పవిత్ర జలంతో శుద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

అన్ని సేవలూ యధాతథంగా..
తిరుమంజనం కారణంగా స్వామివారికి రోజూ నిర్వహించే అష్టదళపాదపద్మారాధనను రద్దు చేశారు. కోయిల్ అళ్వార్ తిరుమంజనం కార్యక్రమాలను డాలర్ శేషాద్రి, రమణ దీక్షితులు పర్యవేక్షించారు. కొద్దమంది తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మాత్రమే పాల్గొన్నారు. భక్తులు లేని లోటు మినహా.. తిరుమల ఆలయంలో శ్రీవారి సేవల్లో ఎలాంటి లోటూ లేదు. యధాతథంగా స్వామివారి సేవలను కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications