నేడే వరలక్ష్మి వ్రతం: టీటీడీ ఏర్పాట్లు పూర్తి: తిరుచానూరులో..!!
తిరుపతి: నేడు వరలక్ష్మీ వ్రతం. ప్రతి శ్రావణ మాసంలో రెండో శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే సందర్భం ఇది. లక్ష్మీ దేవి, పద్మావతి, కనకదుర్గమ్మ.. ఇలా వేర్వేరు రూపాల్లో అమ్మవారిని పూజిస్తారు. నిండు కలశాలతో ఆరాధిస్తారు.
ఈ పండగను పురస్కరించుకుని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించనుంది టీటీడీ. దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ ఏర్పాట్లపై తిరుచానూరులోని ఆస్థానమండపంలో గురువారం జేఈవో.. వీరబ్రహ్మం.. వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లపై శాఖల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు.

నేడు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆస్థానమండపంలో వరలక్ష్మీ వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారు నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనం ఇస్తారు. 500 మంది గృహస్తులు నేరుగా టిక్కెట్లు కొనుగోలు చేసి, ఆస్థాన మండపంలో వ్రతంలో పాల్గొంటారు.
ఇక వర్చువల్గా ఇప్పటివరకు దాదాపు 778 మంది గృహస్తులు సేవ టికెట్లు బుక్ చేసుకున్నారు. వరలక్ష్మీ వ్రతాన్ని భక్తులు తిలకించేందుకు వీలుగా ఎల్ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు టీటీడీ అధికారులు. అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీటి పంపిణీ చేయాలని జేఈఓ ఆదేశించారు.

భక్తులకు పంపిణీ చేయడానికి కుంకుమ ప్యాకెట్లు, కంకణాలు, గాజులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. భజన బృందాలను ఏర్పాటు చేయాలని హిందూ ధర్మప్రచార పరిషత్ అధికారులను ఆదేశించారు. అమ్మవారి ఆలయం, ఆస్థాన మండపం, ఇతర ప్రాంతాల్లో ఆకట్టుకునేలా పుష్పాలంకరణ, విద్యుద్దీపాలంకరణ చేపట్టాలని సూచించారు.
ఆస్థానమండపంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని, అవసరమైన శ్రీవారి సేవకులు, పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులను సమకూర్చుకోవాలని అన్నారు. అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో ముందస్తుగా ఏర్పాట్లు చేపట్టాలని చెప్పారు. వరలక్ష్మీ వ్రతాన్ని శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది టీటీడీ.












Click it and Unblock the Notifications