తిరుమలపై టీటీడీ ఈఓ కొత్త ప్లాన్ ఇదే..!!
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. బుధవారం నాడు 59,231 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 22,029 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.08 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
శ్రీవారి సర్వదర్శనానికి ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో తొమ్మిది కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లల్లో వేచివున్న భక్తులకు శ్రీవారి సేవకులు అల్పాహారం, మంచినీరు, పాలు అందజేశారు.

తిరుమల అభివృద్ధి చేయడానికి తక్షణ చర్యలు
తాజాగా టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు గురువారం సాయంత్రం తిరుపతి టీటీడీ అడ్మిన్ బిల్డింగ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తిరుమలను మరింత అభివృద్ధి చేయడానికి తీసుకుంటోన్న తక్షణ చర్యల గురించి వివరించారు. ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా తిరుమలను తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
మోడల్ టౌన్గా అభివృద్ధి
తిరుమలను పక్కా ప్రణాళికతో ఓ మోడల్ టౌన్గా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని శ్యామలరావు తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హిందూ ధార్మిక కేంద్రమైన తిరుమలను మోడల్ టౌన్గా అభివృధ్ధి చేయడానికి ప్రణాళికాబద్ధంగా డిజైన్లు రూపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు.
విజన్ డాక్యుమెంట్
దీనికోసం విజన్ డాక్యుమెంట్ను రూపొందించాల్సి ఉందని, ఇందులో భాగంగా టీటీడీలో కొత్తగా అర్బన్ డెవలప్మెంట్ అండ్ టౌన్ ప్లానింగ్ వింగ్ను ఏర్పాటు చేయనున్నట్లు శ్యాలమరావు చెప్పారు. తిరుమలలో ఫుట్పాత్లను పాదచారులకు అనుకూలంగా మార్చడంతోపాటు ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు అవసరమైన నిర్మాణాలు, స్మార్ట్ పార్కింగ్ సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు.

బాలాజీ ఆర్టీసీ బస్టాండ్ కొత్తగా నిర్మాణం
కొన్ని పాత కాటేజీలతో పాటు బాలాజీ ఆర్టీసీ బస్టాండ్ను కూడా కొత్తగా నిర్మాణం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. రాబోయే 25 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విజన్ డాక్యుమెంట్ను రూపొందించాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. దానికి అనుగుణంగా తిరుమలలో మౌళిక సదుపాయాలు రూపొందించే ఆలోచన ఉందని చెప్పారు.
రిటైర్డ్ అధికారిని సలహాదారుగా
దీనికోసం టౌన్ ప్లానింగ్ రంగంలో నైపుణ్యం గల రిటైర్డ్ అధికారిని సలహాదారుగా నియమించామని శ్యామలరావు పేర్కొన్నారు. తిరుమలలో మరింతగా ఆధ్యాత్మికత వాతావరణం ఉండేలా ప్రస్తుతం ఉన్న కాటేజీలకు 150 పేర్లు పెట్టబోతోన్నామని, వాటినే కాటేజీ దాతలు ఎంపిక చేసుకుని పేర్లను మార్చేలా టీటీడీ పాలకమండలి ఇటీవలే నిర్ణయం తీసుకుందని ఆయన గుర్తు చేశారు.
ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా
తిరుమలలో పేరుకుపోయిన వ్యర్థాలను కూడా వచ్చే రెండు, మూడు నెలల్లో పూర్తిగా తొలగిస్తామని శ్యామలరావు తెలిపారు. మరింతగా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా, భక్తులకు సౌకర్యవంతంగా తిరుమలను చూడాలన్నదే టీటీడీ అంతిమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications