తిరుమల శ్రీవారి దర్శనాలపై గుడ్ న్యూస్ చెప్తారా ? కీలక చర్చలు జరుపుతున్న టీటీడీ
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం తిరుమల శ్రీవారి ఆలయం మీద కూడా పడటంతో ఆలయంలోకి భక్తుల ప్రవేశాలు నిషేధించిన విషయం తెలిసిందే . అప్పటి నుండి ఇప్పటి వరకు స్వామీ వారి నిత్య కైంకర్యాలు యధావిధిగా జరుగుతున్నా భక్తుల దర్శనాలకు మాత్రం అనుమతి లేదు . ఇక ఈ క్రమంలో లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులను అనుమతించడంపై టిటిడి ట్రస్ట్ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.
అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ఆధారంగా భవిష్యత్ లో దర్శనాలకు అనుమతించాలా వద్దా అని టిటిడి నిర్ణయం తీసుకుంటుందని సుబ్బారెడ్డి శుక్రవారం చెప్పారు.
భారతదేశం అంతటా ఎక్కువ కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నందున పూర్తి లాక్ డౌన్ సడలింపు సాధ్యం కాదని టిటిడి చైర్మన్ అభిప్రాయపడ్డారు. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించేటప్పుడు సామాజిక దూర నిబంధనలను క్యూలలో పాటిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇక తిరుమల వేంకటేశుని యొక్క ఆశీర్వాదాలతో భారతదేశం కరోనావైరస్ నుండి బయటకు వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

భౌతిక దూరం పాటిస్తూ భక్తులకు అనుమతి ఇచ్చే అంశంపై సీరియస్ గానే పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇక లాక్ డౌన్ ఎత్తివేత తర్వాతే శ్రీవారి ఆలయ దర్శనాల విషయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పిన వైవీ సుబ్బా రెడ్డి గతంతో పోలిస్తే దర్శనాలకు అనుమతి విషయంలో చాలా వ్యత్యాసం ఉంటుందని పేర్కొన్నారు . క్యూ లైన్లలో మార్పులు, చేర్పుల విషయాన్ని కూడా ప్రభుత్వాలు , మఠాలు, ఆగమ శాస్త్ర సలహాదారులతో చర్చలు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు . ఇంతకు ముందులా స్వామి వారి దర్శనాలు ఉండకపోవచ్చు అన్న టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఆంక్షలతో కూడిన అనుమతి ఇస్తారేమో అన్న భావన కలుగుతుంది. తిరుమల శ్రీవారి దర్శనాలపై గుడ్ న్యూస్ చెప్తారా ? కీలక చర్చలు జరుపుతున్న టీటీడీ దర్శనాల విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది .












Click it and Unblock the Notifications