నేడు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదల - వస్త్రాల ఈ వేలం..!!
Tirumala: తిరుమలలో వచ్చే నెల ఏప్రిల్ మాసంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈ రోజు (సోమవారం) టీడీడీ విడుదల చేయనుంది. ఆన్ లైన్ టికెట్లను ఈ ఉదయం 11 గంటల నుంచి బెక్ చేసుకోవచ్చని టీటీడీ సూచించింది. ఇదే సమయంలో తిరుమలలో శ్రీరామ నవమి ప్రత్యేక ఉత్సవాల నిర్వహణను ఏర్పాట్లు ప్రారంభించింది. మరో వైపు తిరుమలతో పాటుగా అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను ఏప్రిల్ 10 నుంచి 15వ తేదీ వరకు ఈ - వేలం వేయనున్నారు.
వేసవి ప్రారంభం కావటంతో క్రమేణా తిరుమలలో భక్తుల రద్దీ కూడా పెరుగుతోంది. ఈ సమయంలో టీటీడీ ఇప్పటికే శ్రీవాణి దర్శనం టికెట్లను తగ్గించాలని నిర్ణయించింది. దీంతో పాటుగా వీఐపీ బ్రేక్ దర్శనాల సంఖ్య కూడా కుదించి..సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు ప్రారంభించింది. ఏప్రిల్ నెలకు సంబంధించి ఈ రోజు రూ 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఉదయం 11 గంటల నుంచి ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలని టీటీడీ ఓ ప్రకటనలో సూచించింది. టీటీడీ అధికార వెబ్ సైట్ తో పాటుగా యాప్ ద్వారా ఈ టికెట్లను పొందవచ్చని స్పష్టం చేసింది. ఆన్ లైన్ విధానంలోనే టికెట్లు అందుబాటులోకి తెచ్చిన కారణంగా భక్తులకు దర్శనం..వసతి అన్ని యాప్ ద్వారానే పొందే అవకాశం కలుగుతుందని టీటీడీ చెబుతోంది.

ఇక.. ఈ నెల మార్చి 30, 31వ తేదీల్లో శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి..శ్రీరామపట్టాభిషేకం ఆస్థానాలు నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. మార్చి 30న హనుమంత వాహన సేవ నిర్వహించనున్నారు. మార్చి 30న ఉదయం 9 నుండి 11 గంటల వరకు రంగనాయకుల మండపంలో శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 6:30 నుండి 8 గంటల వరకు హనుమంత వాహనసేవ జరుగుతుంది. ఆ తరువాత రాత్రి 9 నుండి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఈ కారణంగా సహస్రదీపాలంకార సేవను టిటిడి రద్దు చేసింది. మార్చి 31న రాత్రి 8 నుండి 9 గంటల నడుమ బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు.
శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను ఏప్రిల్ 10 నుంచి 15వ తేదీ వరకు ఈ - వేలం వేయనున్నారు. స్వామివారికి సమర్పించిన వాటిలో కొత్తవి,ఉపయోగించిన, పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 297 లాట్లు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఇందులో ఆర్ట్ సిల్క్, పాలిస్టర్ దోతీలు, ఉత్తరీయాలు, చీరలు, ఆఫ్ చీరలు, క్లాత్ బిట్స్, బ్లౌజ్పీస్లు, టర్కీ టవళ్లు, లుంగీలు, శాలువలు, బెడ్షీట్లు,హుండీ గల్లేబులు, దిండుకవర్లు, పంజాబీ డ్రెస్ మెటీరియల్స్, జంకాళం కార్పెట్లు,కార్టెన్లు, గర్భగృహ కురాళాలు, బంగారువాకిలి పరదాలు, శ్రీవారి గొడుగులు ఉన్నాయని వివరించారు. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో గానీ, టీటీడీ వెబ్సైట్ www.tirumala.org , www.konugolu.ap.govt.in సంప్రదించాలని సూచించారు.












Click it and Unblock the Notifications