Tirumala: తిరుమల భక్తులకు అలర్ట్ - శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల జారీ..!!
భక్తుల సౌకర్యార్ధం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదలపై టీటీడీ ప్రకటన చేసింది.
Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అప్ డేట్ ఇచ్చింది. భక్తుల సౌకర్యార్ధం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రేపు (శుక్రవారం) ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది. మార్చి నుంచి మూడు నెలల పాటు వేసవి లో తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉంటుందని టీటీడీ అంచనా వేస్తోంది. దీంతో, దర్శనం తో పాటుగా శ్రీవారి సేవల్లో ఎక్కువ మంది భక్తులకు అవకాశం దక్కేలా టీటీడీ ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా మార్చి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల జారీ పైన నిర్ణయం తీసుకుంది.
ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయని టీటీడీ ప్రకటించింది. అదే విధంగా మే నెల అంగప్రదర్శన టికెట్లను రేపు (శుక్రవారం) మధ్యాహ్నం 2 గంటలకు సీనియర్ సిటిజెన్స్, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మార్చి నెల టికెట్లను ఈ రోజు (గురువారం) ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. టీటీడీ అధికారిక వెబ్ జైట్ తో పాటుగా టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చిన యాప్ ద్వారా వీటిని భక్తులు పొందే అవకాశం ఉంది. ఇదే సమయంలో టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలోని జేఈవో కార్యాలయంలో శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్ల జారీని తిరిగి ప్రారంభించింది. ఇప్పటికే ఆన్ ైన్ లో రోజుకు 750 టికెట్లను జారీ చేసారు. ఈ నెలాఖరు వరకు రోజుకు 150 టికెట్లను ఆఫ్ లైన్ లో జారీ చేయాలని నిర్ణయించారు.

మార్చి నుంచి ప్రతీ రోజు జారీ చేసే వెయ్యి టికెట్లలో ఆన్ లైన్ లో 500 టికెట్లు.. 400 టికెట్లను గోకులం (జేఈవో) కార్యాలయంంలో ఆఫ్ లైన్ లో..రేణిగుంట విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కింద నేరుగా భక్తులకు జారీ చేస్తామని జేఈవో కార్యాలయం ప్రకటించింది. గతంలో శ్రీవాణి టికెట్లు కొనుగోలు చేసిన వారు ఇతరులకు విక్రయించటం..ఆరోపణల నేపథ్యంలో ఈ సారి టికెట్ పొందే భక్తుడు..లేదా కుటుంబ సభ్యులు నేరుగా రావటం ద్వారా వారికే టికెట్ కేటాయించాలని నిర్ణయించారు. మార్చి నెల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ పెరిగి ఏప్రిల్ ద్వితీయార్ధంలో ఎక్కువగా ఉండే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు రేపటి నుంచి ఆన్ లైన్ లో జారీ కానున్నాయి.












Click it and Unblock the Notifications