ఢిల్లీకి ఏపీ మంత్రులు - బొత్స సహా: జగన్ లక్ష్యానికి అనుగుణంగా..!!
విజయవాడ: విజయవాడలో నిర్మించ తలపెట్టిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహం పనులు జోరుగా సాగుతున్నాయి. 125 అడుగుల ఎత్తు ఉన్న విగ్రహం ఇది. విజయవాడలోని స్వరాజ్ మైదాన్లో దీన్ని ఆవిష్కరించనుంది ఏపీ ప్రభుత్వం. విగ్రహం నమూనాను పరిశీలించడానికి మంత్రులు, అధికారులు ఢిల్లీకి వెళ్లనున్నారు. అనంతరం ఖరారు చేస్తారు. అదే తరహా విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం.
విజయవాడలోని స్వరాజ్ మైదాన్లో 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదివరకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా ఆయన చర్యలు తీసుకున్నారు. విగ్రహ నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేశారు. అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ పేరుతో ఇది ఏర్పాటైంది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ఈ కమిటీకి ఛైర్మన్గా నియమితులయ్యారు.

ఇవ్వాళ ఢిల్లీకి వెళ్లనున్న ప్రతినిధుల్లో మేరుగ నాగార్జునతో పాటు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి తదితరులున్నారు. ఏపీఐఐసీ వైస్ ఛైర్మన్ అండ్ ఎండీ సుబ్రహ్మణ్యం, ఏపీఐఐసీ ఈఎన్సీ శ్రీనివాస్ ప్రసాద్, ఈ ప్రాజెక్ట్ను నిర్మిస్తోన్న కేపీసీ ప్రాజెక్ట్ ఎండీ అనిల్ కుమార్ ఉన్నారు.
అంబేద్కర్ విగ్రహ నమూనా ఢిల్లీలోని ఓ స్టూడియోలో మట్టితో తయారు చేశారు. దీన్ని పరిశీలించిన అనంతరం అందులో ఏవైనా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటే దానికి అనుగుణంగా మంత్రులు సూచనలు చేస్తారు. అనంతరం విగ్రహ తుది నమూనాకు ఆమోదం తెలుపుతారు. వచ్చే అంబేద్కర్ జయంతి నాటికి ఈ విగ్రహాన్ని విజయవాడ స్వరాజ్ మైదాన్లో ఏర్పాటు చేసేలా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది.












Click it and Unblock the Notifications