తాడేపల్లిలో దారుణం: కాబోయే భర్తను కట్టేసి యువతిపై గ్యాంగ్రేప్, సీఎం నివాసానికి సమీపంలోనే ఘోరం
అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సీతానగరం పుష్కర ఘాట్ల వద్ద నదీ తీరంలో సేదతీరుతున్న ఓ జంట(త్వరలో వివాహం చేసుకోబోతున్నారు)పై దుండగులు దాడి చేశారు. యువకుడ్ని కట్టేసి.. యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం సీఎం అధికార నివాసానికి కిలోమీటరున్నర దూరంలోనే జరగడం గమనార్హం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కాబోయే భర్తతో సీతాపురం పుష్కరఘాట్కి..
పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ న్యూరాజరాజేశ్వరిపేటకు చెందిన 20 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని శిక్షణలో భాగంగా విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తోంది. శనివారం రాత్రి 8 గంటలకు విధులు ముగిశాక కాబోయే భర్తతో కలిసి విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా సీతానగరం పుష్కరఘాట్ వైపు వచ్చారు. నది లోపలికి వెళ్లి ఇసుక తిన్నెలపై కూర్చున్నారు.

యువకుడ్ని కట్టేసి.. యువతిపై గ్యాంగ్రేప్
కాగా, అప్పటికే అక్కడే ఉన్న ఇద్దరు దుండగులు ఈ జంటను గమనించారు. ఒక్కసారిగా వచ్చి వీరిపై వెనుకనుంచి దాడి చేశారు. బ్లేడ్లు చూపుతూ చంపేస్తామని బెదిరించారు. యువకుడిని ఈడ్చేసి బాధితురాలి చున్నీతో కాళ్లు చేతులు కట్టేశారు. అతని మెడపై బ్లేడు పెట్టి బెదిరించారు. ఆ తర్వాత మరొకడు బాధితురాలిని ఈడ్చుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

దోపిడీ చేసి.. పరారయ్యారు..
ఆ తర్వాత రెండో దుండగుడు కూడా ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డాడు. బాధుతులు కేకలు వేసినప్పటి రాత్రి కావడంతో అక్కడ ఎవరూ లేకపోవడం, రోడ్డుకు దూరంగా ఉండటంతో ఎవరికీ వినిపించలేదు. ఆ జంట వద్ద ఉన్న సెల్ఫోన్లు, డబ్బు, బాధితురాలి చెవిదుద్దులు బలవంతంగా లాక్కున్న నిందితులు అక్కడ్నుంచి నాటు పడవలో పరారయ్యారు. కాగా, కొంత సేపటి తర్వాత అటుగా వెళ్లిన ఓ వ్యక్తి విషయాన్ని గమనించి తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

బ్లేడ్ బ్యాచీ పనేనా.. అసాంఘిక శక్తులా అడ్డాగా సీతానగరం పుష్కర ఘాట్
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. ఈ దారుణానికి పాల్పడింది బ్లేడ్ బ్యాచే అయ్యుంటుందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం బాధిత యువకుడితో కలిసి పోలీసులు నదీతీరంలో గాలించారు. సంఘటనా స్థలంలో బాధితురాలు తెచ్చుకున్న నీళ్ల బాటిల్, ఆమె సెల్ఫోన్ బ్యాక్పౌచ్, చిరిగిన దుస్తుల గుడ్డముక్కలు లభించాయి. అక్కడే రెండు బీర్ సీసాలూ ఉన్నాయి. కాగా, సీతానగరం పుష్కర ఘాట్ ప్రాంతమంతా అసాంఘిక శక్తుల అడ్డగా మారిందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు నిఘా పెట్టాలని కోరుతున్నారు. కాగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. గుంటూరు అర్బన్ అడిషనల్ ఎస్పీ ఈశ్వరరావు, నార్త్ జోన్ డీఎస్పీ దుర్గప్రసాద్, విజయవాడ టాస్క్ఫోర్స్ ఏసీపీ రమణమూర్తితో కూడిన బృందం సంయుక్తంగా ఆదివారం సాయంత్రం ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.












Click it and Unblock the Notifications