నేడు అమరావతి బంద్ ..పోలీసులకు సహాయ నిరాకరణ .. మంచినీళ్ళు కూడా ఇవ్వం : రైతులు
రాజధాని అమరావతి తరలింపుకు నిరసనగా రైతుల ఆందోళనలు చేస్తున్న క్రమంలో పోలీసులు మహిళలను అరెస్ట్ చెయ్యటం వారిపై దుర్భాషలాడటం , దాడికి పాల్పడటం వంటి ఘటనలు ఏపీ రాజధాని రైతుల్లో ఆగ్రహానికి , రాజధాని అమరావతిలో ఉద్రిక్తతలకు కారణం అయ్యింది నిన్న అమరావతి గ్రామాల్లో సకల జనుల సమ్మె నేపధ్యంలో మందడంలో మహిళలు ఆందోళనకు దిగగా పోలీసులు వారిపై దాడి చేసి మరీ అరెస్ట్ చేశారు. ఈ ఘటన నేపధ్యంలో రాజధాని రైతులు భగ్గుమంటున్నారు. నేడు అమరావతి గ్రామాల బంద్ నిర్వహిస్తున్నారు. అంతే కాదు పోలీసులకు సహాయ నిరాకరణ చెయ్యనున్నారు.

మందడం గ్రామంలో మహిళలపై పోలీసుల దాడి నేపధ్యంలో ఉద్రిక్తత
రాజధాని అమరావతి తరలింపు వద్దు రాజధానిగా అమరావతినే ముద్దు అని ఆందోళనలు చేస్తున్న మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. సకల జనుల సమ్మెలో భాగంగా ఆందోళనలను ఉధృతం చేస్తున్న క్రమంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వాహనాన్ని వెళ్లనీయకుండా గ్రామస్తులు అడ్డుకుని వాహనం ముందు రోడ్డుపైనే పడుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మహిళా రైతులపై పోలీసులు దాడి చేసి, వారిని విచక్షణా రహితంగా ఈడ్చుకెళ్ళారు.

పోలీసులపై మహిళల ఫిర్యాదు.. ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన టీడీపీ
చున్నీతో ఓ మహిళా రైతు గొంతును పోలీసులు నులిమేశారని రైతులు ఆరోపించారు. ఈ ఘర్షణలో ఓ మహిళ స్పృహతప్పి పడిపోయిందని రైతులు చెప్పారు. అసభ్యకరంగా తమను దూషించారని మహిళల ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్ట్ సమయంలో తమ బంగారు గొలుసులు పోయాయని, మంగళసూత్రాలను కూడా పోలీసులు లాగేశారంటూ మహిళలు వాపోయారు. ఇక మహిళలపై పోలీసుల దాడిపై వారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిరసనగా నేడు అమరావతిలోని రాజధాని గ్రామాల బంద్ కొనసాగుతుంది. మరోపక్క టీడీపీ మహిళలపై దాడిని ఖండించి ఎన్హెచ్ఆర్సీకి మహిళలపై దాడి ఘటనపై ఫిర్యాదు చేసింది.

మహిళలపై పోలీసుల దాడికి నిరసనగా రాజధాని బంద్
ఇక నేడు మందడంలో ఉదయం నుంచి బంద్ కొనసాగుతుంది . మహిళలపై దౌర్జన్యానికి నిరసనగా ఉదయమే రహదారిపైకి వచ్చిన రైతులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు . ఇక నేడు పోలీసుల తీరుకు నిరసనగా పోలీసులకు గ్రామస్థుల సహాయ నిరాకరణ చేస్తున్నారు. తమ గ్రామంలో పోలీసులకు మంచినీళ్లు కూడా ఇవ్వకూడదని గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు . తమ దుకాణాల ముందు సైతం పోలీసులు కూర్చోవటానికి వీల్లేదని గ్రామస్తులు స్పష్టం చేశారు.

పోలీసులకు సహాయ నిరాకరణ .. నీళ్ళు కూడా ఇచ్చేది లేదు
ఇక అంతే కాదు తమ గ్రామం మీదుగా వెళ్లటానికి వీల్లేదని పోలీసు వాహనాలను అడ్డుకుని రైతులు వెనక్కి పంపిస్తున్నారు . ఈ నేపథ్యంలో పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం నెలకొంది. నేడు కూడా మందడం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది .రహదారి మొత్తం పరదా పరిచి రాకపోకలను పూర్తిగా స్థంభింప చేశారు. దుకాణాలు తెరవనీయకుండా రైతులు సంపూర్ణ బంద్ పాటిస్తున్నారు. పోలీసుల దాడికి నిరసనగా నేడు మరింత ఉద్రిక్తంగా ఆందోళన కొనసాగించనున్నారు .












Click it and Unblock the Notifications