కరోనాపై సీఎం జగన్ రివ్యూ: బస్సులు నడపాలి, రెస్టారెంట్లు తెరవాలి! కానీ..
అమరావతి: సీఎం క్యాంపు కార్యాలయంలో కోవిడ్-19పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రి కన్నబాబు, సీఎస్ నీలం సాహ్నీ, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్యారోగ్యశాఖ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అలాంటి ఆలోచనలు వద్దు..
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కరోనా పట్ల భయాందోళనలు పోవాలన్నారు. వలస కార్మికులను ఆదుకునే విషయంలో అధికారులు బాగా పని చేశారని అన్నారు. రాష్ట్రం గుండా నడిచివెళ్తున్నవారికి సహాయంగా నిలిచారని,
యుద్ధప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ తీసుకున్నారని అభినందించారు. వీళ్లు మన ఓటర్లా? మన రాష్ట్ర ప్రజలా? అని ఆలోచన చేయడం సరికాదని ఈ సందర్భంగా జగన్ వ్యాఖ్యానించారు. మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన సమయమని, మానవత్వంతో వారిని ఆదుకోవాలని అధికారులకు సూచించారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు బస్సు ఎక్కితే..
కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీచేసిన మార్గదర్శకాలపై సమావేశంలో చర్చ జరిగింది. అంతర్ రాష్ట్ర సర్వీసులను ఎలా నడపాలన్నదానిపైనా చర్చించారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాలనుంచి రావాలనుకుంటున్నవారికి బస్సులు నడపడంపై చర్చకు వచ్చింది. దశలవారీగా సర్వీసులు పెంచుకుంటూ వెళ్లాలని నిర్ణయించారు. బస్టాండ్ నుంచి బస్టాండ్ వరకూ సర్వీసులు, మధ్యలో ఎక్కేందుకు అనుమతి లేదన్నారు. బస్టాండులో ప్రయాణికులు దిగిన తర్వాత పరీక్షలు చేయాలని, బస్సు ఎక్కిన వ్యక్తికి సంబంధించి పూర్తి వివరాలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఎక్కడ నుంచి బయల్దేరారు, ఎక్కడికి వెళ్తున్నారు అన్నదానిపై వివరాలు తీసుకోవాలన్నారు. దీని వల్ల వ్యక్తి ట్రేసింగ్ సులభం అవుతుందన్నారు సీఎం జగన్. రాష్ట్రంలో భౌతిక దూరం పాటిస్తూ బస్సు సర్వీసులు నడపాలని, బస్సులో ప్రయాణించేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సీఎం స్పష్టంచేశారు.

రాష్ట్రంలోనూ బస్సు సర్వీసులు నడపాలి..
రాష్ట్రంలోకూడా బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయించారు. దీనిపై విధివిధానాలు తయారుచేయాలని సీఎం ఆదేశించారు. సగం సీట్లు మాత్రమే నింపి బస్సు సర్వీసులు నడపాలని, ప్రైవేటు బస్సులకూ అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాల్సిందేనన్నారు. వలస కార్మికుల తరలింపు పూర్తయిన తర్వాత బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయించారు. బస్సు సర్వీసులు ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయన్న అంశంపై మూడు నాలుగు రోజుల్లో ప్రకటించనున్నారు. ప్రజల భాగస్వామ్యంతో కరోనా నివారణ సాధ్యమన్నారు సీఎం జగన్. కారులో ముగ్గురు మాత్రమే ప్రయాణించేలా చూడాలని, బస్సులో 20 మందికే అనుమతి ఇవ్వాలన్నారు. ప్రతి దుకాణంలో ఐదుగురు మాత్రమే ఉండాలని, పెళ్లిళ్లు లాంటి కార్యక్రమాలకు 50 మందికే అనుమతి ఉందని వివరించారు.

రెస్టారెంట్ల వద్ద టేక్ అవేకు అనుమతి
రెస్టారెంట్ల వద్ద టేక్ అవే సమయంలో భౌతిక దూరం పాటించాల్సిందేనని సమావేశం స్పష్టం చేసింది. నైట్ కర్ఫ్యూ రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 గంటలవరకూ కొనసాగుతుందని, అన్ని దుకాణాలూ ఉదయం 7 గంటలనుంచి రాత్రి 7 గంటలవరకూ తెరుచుకునేందుకు అనుమతి ఉందని తెలిపారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారు తమకు తాము స్వచ్చందంగా ఆరోగ్య పరిస్థితులను తెలియజేయడంపై దృష్టి పెట్టాలన్నారు సీఎం జగన్. ప్రజల్లో ఆందోళన, భయం తొలగిపోయేలా పెద్ద ఎత్తున్న ప్రచారం నిర్వహిస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. వార్డు క్లినిక్స్ ఏర్పాటుపై దృష్టిపెట్టాలని, స్థలాల గుర్తింపును వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. వచ్చే మార్చి నాటికి ఇవి పూర్తికావాలని సీఎం ఆదేశించారు. విలేజ్, వార్డు క్లినిక్స్ ద్వారా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు పూర్తి పరిష్కారం లభిస్తుందని సీఎం చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులంతా కార్యాలయాలకు హాజరయ్యేలా చూడాలని.. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications