దుర్గమ్మను దర్శించిన గవర్నర్ దంపతులు: మూడు లక్షలమందికి పైగా!
విజయవాడ: దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఆయన భార్య సుప్రవ హరిచందన్ మంగళవారం కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. గవర్నర్ దంపతులను ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేదోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి అమ్మవారి శేషవస్త్రాన్ని బహూకరించారు. గవర్నర్ గా బాధ్యతలను స్వీకరించిన తరువాత విశ్వభూషణ్ హరిచందన్ అమ్మవారి గుడికి రావడం ఇదే తొలిసారి కావడంతో ఆలయ సిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేశారు. వారికి తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.
నవరాత్రుల సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి దుర్గమ్మను దర్శించడానికి వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు, సిబ్బంది చేసిన ఏర్పాట్లపై గవర్నర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. కాగా, దసరా ఉత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచీ భక్తులు అమ్మవారి దర్శనం కోసం పోటెత్తుతున్నారు. ఇప్పటిదాకా మూడు లక్షల మందికి పైగా భక్తులు దుర్గా మల్లేశ్వర స్వామిని దర్శించినట్లు అంచనా వేస్తున్నారు. భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల నుంచి మంగళవారం ఉదయం పెద్ద సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు.

ఈ ఏడాది సుమారు 15 లక్షల మంది వరకు భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని, దీనికి అనుగుణంగా ఏర్పాట్లను పూర్తి చేశామని ఆలయ అధికారులు వెల్లడించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. పార్కింగ్ సమస్యను పరిష్కరించడంపై దృష్టి పెట్టారు.

అమ్మవారి మూలా నక్షత్రం రోజున రాత్రి ఒంటి గంట నుంచే గర్భాలయాన్ని భక్తుల దర్శనం కోసం తెరుస్తామని అన్నారు. విజయదశమి నాడు తెల్లవారు జామున 3 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు మహిషాసురమర్దినిగా, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాజ రాజేశ్వరిగా అమ్మవారు దర్శనం ఇస్తారు. అనంతరం అదే రోజు సాయంత్రం తెప్పోత్సవాన్ని చేపడతారు.












Click it and Unblock the Notifications