fact check : జగన్ హెలికాఫ్టర్ లో సాయిరెడ్డికి చోటు నిరాకరణ..! అసలేం జరిగిందంటే ?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ విశాఖలో ఎల్.జి. పాలిమర్స్ దుర్ఘటనలో బాధితులను పరామర్శించేందుకు ఆయన క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరుతున్న సమయంలో ఓ ఘటన చోటుచేసుకుంది. సీఎం జగన్ తో పాటు క్యాంపు కార్యాలయం బయటికి వచ్చిన ఎంపీ విజయసాయిరెడ్డి ఆయనతో పాటు కారు ఎక్కి కూర్చున్నారు. కానీ నిమిషాల వ్యవధిలోనే ఆయన కారు దిగిపోయారు. ఆ తర్వాత సీఎం కాన్వాయ్ యథావిధిగా వెళ్లిపోయింది.

సీఎం క్యాంపు ఆఫీసులో ఆసక్తికర ఘటన...
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఏపీ సీఎం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఇవాళ ఉదయం ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సీఎం జగన్ విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ ఘటన బాధితుల పరామర్శకు బయలుదేరి వెళుతున్న సమయంలో జరిగిన ఈ ఘటన
వైసీపీ పరిణామాలను కొన్నేళ్లుగా గమనిస్తున్న వారికి అంతగా ఆశ్చర్యం కలిగించలేదు. కానీ విపక్ష టీడీపీ శ్రేణులు మాత్రం దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ఇదో వివాదంగా మారింది. దీంతో వన్ ఇండియా వాస్తవాలు నిర్ధారించుకునేందుకు ప్రయత్నించింది.
సీఎం జగన్ విశాఖ వెళ్లేందుకు బయలుదేరుతున్న సమయంలో తనతో పాటు కొందరు ముఖ్య నేతలను తీసుకెళ్లాలని భావించారు.

అసలేం జరిగిందంటే ?
సీఎం జగన్ విశాఖ బయలుదేరుతున్న క్రమంలో వైసీపీలో కీలక నేతగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి కూడా యథాలాపంగా సీఎం జగన్ తో పాటు ఆయన కారులోకి ఎక్కి కూర్చున్నారు. కానీ అప్పటికే కరోనా వైరస్ పై సీఎం వద్ద సమీక్షకు హాజరైన డిప్యూటీ సీఎం ఆళ్లనాని విశాఖ వెళ్లేందుకు సిద్దమయ్యారు. కానీ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా సోషల్ డిస్టెన్స్ పాటించాల్సి రావడం, ఛాపర్ లో ఎక్కువ మంది ప్రయాణించేందుకు వీలు లేకపోవడంతో ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీలో సీనియర్ అయినా వెనక్కి తగ్గి డిప్యూటీ సీఎం ఆళ్లనానిని సీఎంతో పాటు విశాఖ వెళ్లేందుకు అవకాశం ఇచ్చారు. కానీ అక్కడ ఏం జరిగిందో స్పష్టంగా తెలియకుండానే సోషల్ మీడియాలో జగన్ ఎంపీ విజయసాయిరెడ్డిని కారు దిగిపోవాలని ఆదేశించినట్లు, సాయిరెడ్డికి ఇదే అవమానం అన్నట్లుగా వైరల్ అవుతోంది. దీన్ని వైసీపీ వర్గాలు తీవ్రంగా తప్పుబట్టాయి.

సోషల్ ప్రచారంపై భగ్గుమన్న వైసీపీ.. ఆళ్లనాని ఖండన..
విశాఖ టూర్ కు వెళ్లే క్రమంలో హెలికాఫ్టర్ లో సీఎంతో కలిసి వెళ్లేందుకు పార్టీలో సీనియర్ అయిన ఎంపీ విజయసాయిరెడ్డి తనకు అవకాశం కల్పిస్తే దాన్ని ఓ అవమానంగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడంపై డిప్యూటీ సీఎం ఆళ్లనాని తప్పుబట్టారు.
బాధితుల పరామర్శకు సీఎం హెలికాఫ్టర్లో బయలుదేరారని, ఎంపీ సాయిరెడ్డి హెలికాఫ్టర్లో తన స్ధానాన్ని వదులుకుని నన్ను పంపించారని ఆళ్లనాని తెలిపారు. తన మీద గౌరవంతో సాయిరెడ్డి సీటిస్తే విష ప్రచారం చేస్తున్నారని టీడీపీ శ్రేణులపై ఆయన మండిపడ్డారు. విశాఖ ప్రమాదం కన్నా వీరికి నీచ రాజకీయాలే ముఖ్యం అయ్యాయన్నారు. దిగజారిన వారి మానసిక స్ధితి చూసి జాలి పడుతున్నట్లు ఆళ్ళనాని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో ఇలాంటి సంస్కారం ఎక్కడైనా కనిపిస్తుందా అని ప్రశ్నించారు. సీటుకోసం వెన్నుపోటుతో హత్యారాజకీయాలు చేసే పార్టీ టీడీపీ అని... టీడీపీ శ్రేణులకు, వారి సామాజిక మాధ్యమాలకు ఇంతకన్నా పనేముందని ప్రశ్నించారు. వైయస్ కుటుంబంతో విజయసాయిరెడ్డి గారిది ఆత్మీయ అనుబంధం అని నాని గుర్తుచేశారు.
వైసీపీలో ఎంపీ విజయ సాయిరెడ్డి అంకిత భావం, చిత్తశుద్ధి శంకించలేనిదని ఆళ్లనాని తెలిపారు. ప్రజాసేవకోసం సాయిరెడ్డి జగన్ ఆదేశాలను తూ.చా తప్పక అమలు చేస్తారన్నారు. మాటమీద నిలబడ్డ నాయకుడి వెంటే సాయిరెడ్డి నడుస్తున్నారని, ప్రజలకోసం, నాయకుడి కోసం నిలబడ్డ వారు ఒక్కరైనా టీడీపీలో ఉన్నారా అని ఆళ్ళనాని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications