ఈ నెల 19వ తేదీన విజయవాడలో.. లక్షమంది సమక్షంలో
Ambedkar statue: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తయిన కాంస్య విగ్రహావిష్కరణ గడువు సమీపిస్తోంది. ఇంకో మూడు రోజులే మిగిలివుంది. విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.
విగ్రహావిష్కరణ ఏర్పాట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయిరెడ్డి, ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశిల రఘురాం, విజయవాడకు చెందిన పార్టీ సీనియర్ నేతలు, అధికారులు పరిశీలించారు. స్వరాజ్ మైదానాన్ని సందర్శించారు.

ఈ నెల 19న నిర్వహించబోయే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణతో పాటు స్మృతివనాన్నీ ప్రారంభిస్తారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ కార్యక్రమానికి ఉమ్మడి గోదావరి జిల్లాలు, గుంటూరు, పల్నాడు, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, రాయలసీమ జిల్లాల నుంచి సుమారు లక్షమంది వరకు ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
భారీగా స్వరాజ్ మైదానానికి తరలివచ్చే వారి కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేస్తోన్నారు అధికారులు. బారికేడ్లను ఏర్పాటు చేస్తోన్నారు. దాదాపుగా అన్ని జంక్షన్లలోనూ భారీ ఎల్ఈడీ స్క్రీన్లను అమర్చుతున్నారు. 19వ తేదీన విజయవాడలో వాహనాలను దారి మళ్లించనున్నారు. ట్రాఫిక్ ఆంక్షలను విధించనున్నారు.
సుమారు 400 కోట్ల రూపాయల వ్యయంతో స్వరాజ్ మైదాన్లో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించింది ఏపీ ప్రభుత్వం. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్గా నామకరణం చేసింది. 19 ఎకరాల్లో స్మృతివనాన్ని ఏర్పాటు చేసింది. అంబేద్కర్ జీవితంలోని ముఖ్య ఘట్టాలతో కూడిన ఫొటో గ్యాలరీ, కన్వెన్షన్ సెంటర్ను ఇందులోనే నిర్మించింది.












Click it and Unblock the Notifications