బెజవాడ దుర్గమ్మకు భారీ ఆదాయం..ఎన్నికోట్లో తెలుసా!?
బెజవాడ కనకదుర్గమ్మకు భారీ ఆదాయం సమకూరింది. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలలో బెజవాడ దుర్గమ్మ ఆలయం ఒకటి. ఇక్కడికి నిత్యం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా వెలసింది కనకదుర్గమ్మ. ఏటా దసరా నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ ఎంతో వైభవంగా జరుగుతాయి. కేవలం ఇరవై ఐదురోజుల్లోనే కనక దుర్గమ్మ ఆలయానికి రూ.3,78,72,537 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.
హుండీల్లో సమర్పించిన కానుకలను మల్లికార్జున మహా మండపం ఆరో అంతస్తులో ఆలయ అధికారులు, వన్టౌన్ పోలీసులు, దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో లెక్కించారు. నగదుతోపాటు 900 గ్రాముల బంగారం, 7.820 కిలోల వెండి వస్తువులను భక్తులు దుర్గమ్మకు మొక్కుల రూపంలో చెల్లించుకున్నారు. వీటితో పాటు హుండీల్లో వివిధ దేశాలకు చెందిన కరెన్సీ కూడా ఉంది. ఇందులో 3833 యూఎస్ఏ, 30 ఆస్ట్రేలియా, 138 సింగపూర్ డాలర్లు, 20 యూకే పౌండ్లు, 135 యూరోలు కూడా ఉన్నాయి. బెజవాడ కనకదుర్గమ్మను ప్రత్యక్షంగా దర్శించుకోలేని భక్తులు ఆన్లైన్లో ఇ-హుండీ ద్వారా రూ.1,22,800 సమర్పించినట్లు ఆలయ ఈవో రామారావు తెలిపారు. ఇక, ఈ హుండీల లెక్కింపు ప్రక్రియలో ఈవో రామారావు, ఈఈ కోటేశ్వరరావు, పోలీసు, ప్రత్యేక పోలీసు తదితరులు ఉన్నారు.

ఎన్నికల కోడ్ తర్వాత ఆలయానికి భారీ ఆదాయం..
ఎన్నికల కోడ్ అనంతరం ఆలయంలో టికెట్ల ఆదాయం గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. ఎలక్షన్ కోడ్ రాక ముందు టికెట్ల రీసైక్లింగ్, ప్రొటోకాల్ పేరుతో ఉచిత దర్శనాలతో దేవస్థానం ఆదాయం చాలా తక్కువుగా ఉన్నట్లు సమాచారం. కోడ్ రాకముందు మార్చి 10 వ తేదీన 5,479 దర్శనం టికెట్ల ద్వారా రూ.11.49 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ వచ్చాక అంటే మార్చి 17వ తేదీన 8,120 దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.18.29 లక్షల ఆదాయం లభించిందని అధికారులు పేర్కొన్నారు. 24వ తేదీన 9,877 దర్శనం టిక్కెట్ల ద్వారా 21.74 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది. కోడ్ అమల్లో వచ్చాక ప్రొటోకాల్ దర్శనాలు, అనధికార దర్శనాలు తగ్గడంతో ఆలయ ఆదాయం గణనీయంగా పెరిగిందని కనకదుర్గమ్మ ఆలయ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications