జగన్ మాట తప్పాడు.. మడమ తిప్పాడు... అమరావతి స్వప్నం సర్వనాశనం : చంద్రబాబు
సీఆర్డీఏ రద్దు,పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం పలికిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజల ఆకాంక్ష నెరవేరిందని వైసీపీ దీన్ని సెలబ్రేట్ చేస్తుండగా... టీడీపీ మాత్రం దీన్ని దుర్మార్గ చర్యగా అభివర్ణిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దీన్ని రాజ్యాంగ వ్యతిరేక,పునర్విభజన చట్ట వ్యతిరేక చర్యగా ఆరోపించారు. ప్రభుత్వం రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకుంటోందని.. ఆంధ్రుల కలను చిన్నాభిన్నం చేశారని ధ్వజమెత్తారు.

అమరావతి స్వప్నాన్ని సర్వనాశనం చేశారు : చంద్రబాబు
అమరావతి ఆంధ్రుల కల అన్న చంద్రబాబు... రాష్ట్రం విడిపోయాక ఇక్కడి ప్రజలు తమకూ ఓ రాజధాని కావాలని కోరుకున్నారన్నారు. అందుకు తగ్గట్లే ప్రజా ఆకాంక్ష మేరకు అమరావతి పుట్టుకొచ్చిందన్నారు. 29వేల మంది రైతులు 33 వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్కి ముందుకొచ్చారని గుర్తుచేశారు. ప్రపంచంలో ఇలా రైతులు స్వచ్చందంగా ముందుకొచ్చి ఇంత భారీ స్థాయిలో భూములివ్వడం మరెక్కడా జరగలేదన్నారు. భూములిచ్చిన రైతులకు ఒక నమ్మకాన్ని కలిగించామని... రాజధాని ఏర్పడితే మీరు లాభపడుతారని... రాష్ట్రం అభివృద్ది చెందుతుందని భరోసానిచ్చామన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం అమరావతి స్వప్నాన్ని సర్వ నాశనం చేసిందన్నారు.

అప్పుడు మద్దతునిచ్చి.. ఇప్పుడెందుకు మడమ తిప్పారు..?
అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని 220 రోజుల నుంచి రైతులు ఆందోళనలు చేస్తున్నారని చంద్రబాబు గుర్తుచేశారు. ఈ క్రమంలో కొంతమంది రైతులు చనిపోయారని,మహిళలు అవమానాలకు గురయ్యారని చెప్పారు. వాళ్లు చేసిన తప్పేంటని... ప్రభుత్వం ఎందుకింత నీచంగా వ్యవహరించిందని ప్రశ్నించారు. పునర్విభజన చట్టంలో స్పష్టంగా ఒక రాజధాని గురించి పేర్కొన్నారు తప్ప మూడు రాజధానుల ప్రస్తావన లేదన్నారు. అసలు రాష్ట్ర,దేశ స్థాయిలో ఎక్కడా మూడు రాజధానుల విధానం లేదన్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి అప్పుడు ప్రతిపక్ష నేతగా అమరావతికి పూర్తి మద్దతునిచ్చాడని... కానీ ఇప్పుడెందుకు మడప తిప్పాడని ప్రశ్నించారు.

దుర్మార్గమైన చర్య...
ఆరోజు రాజధానికి మద్దతునిస్తున్నట్లు మభ్యపెట్టి ఇప్పుడు ప్రజలకు అన్యాయం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. పాలనా వికేంద్రీకరణ బిల్లును కౌన్సిల్ సెలెక్ట్ కమిటీకి పంపిందని... ఏజీ కూడా ఇదే విషయాన్ని కోర్టుకు తెలిపారని గుర్తుచేశారు. కౌన్సిల్ ఛైర్మన్ స్వయంగా గవర్నర్ను కలిసి సెలెక్ట్ కమిటీని అమలుచేయట్లేదని ఫిర్యాదు చేశారన్నారు. అయినా గవర్నర్ వైపు నుంచి ఎలాంటి చర్యలు లేవన్నారు. సెలెక్ట్ కమిటీని అమలుచేయకుండానే... కొత్త బిల్లులు పంపించి గవర్నర్తో సంతకం పెట్టించడం దుర్మార్గమైన చర్య అన్నారు.

3 రాజధానులతో అభివృద్దికి విఘాతం..
రాజధాని కోసం అప్పటికే రూ.10వేల కోట్లు ఖర్చు చేశామని.. అది ప్రజా ధనమని,ఇప్పుడు ప్రజలకు ఏం చెప్తారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇంకాస్త బడ్జెట్ అయితే అక్కడ రాజధాని అభివృద్ది చెందేదని... కానీ రాజధానిపై లేని పోనివి ప్రచారంలోకి తెచ్చారని ఆరోపించారు. అక్కడ రాజధానికి లక్ష కోట్లు కావాలని,భూకంపాలు వస్తాయని,వరద ముప్పు అని,ఫౌండేషన్ సరిగా ఉండదని తప్పుడు ప్రచారం చేశారన్నారు. అక్కడి భూములన్నీ అమ్మేసుకున్నామని తమపై కూడా ఆరోపణలు చేశారన్నారు. అభివృద్ది వికేంద్రీకరణ అంటే ప్రజల ఆదాయం పెంచేలా,భవిష్యత్తును ఆశాజనకంగా తీర్చిదిద్దే చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతే తప్ప 3 రాజధానుల ఏర్పాటు అభివృద్దికి విఘాతం అన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా మూడు రాజధానులు ఉన్నాయా అన్నది ప్రజలు ఆలోచించాలన్నారు.
Recommended Video

ఆ ప్రాజెక్టులన్నీ ఏమవ్వాలి..?
టీడీపీ హయాంలో అమరావతిని రాజధానిగా ప్రకటించిన రోజే... జిల్లాల అభివృద్దికి ప్రణాళికలు ప్రకటించామన్నారు చంద్రబాబు.శ్రీకాకుళానికి 12 ప్రాజెక్టులు,విజయనగరానికి 10 ప్రాజెక్టులు,విశాఖకు 13,తూర్పు గోదావరికి 14,పశ్చిమ గోదావరికి 14,కృష్ణాకి 14,గుంటూరుకి 11,ప్రకాశంకి 8,నెల్లూరుకి 9,చిత్తూరుకి 12,కడపకి 9,అనంతపురానికి 17 ప్రాజెక్టులు ప్రకటించామన్నారు. ఇప్పుడు మూడు రాజధానుల ప్రకటనతో ఇవన్నీ చిన్నాభిన్నం అయినట్లేనని విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎక్కడ చూసినా విధ్వంసం తప్ప అభివృద్ది లేదన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ రాజీ లేని పోరాటం చేస్తుందన్నారు. జేఏసీ పిలుపు మేరకు రైతులకు సంఘీభావంగా టీడీపీ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటుందని వెల్లడించారు. ఈ పోరాటంలో ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications