ఏపీకి ప్రధాని మోదీ..ఆహ్వానించిన సీఎం జగన్ : అక్టోబర్ 15న పర్యటన : ఇక ముఖ్యమంత్రి రచ్చబండ....!!
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రధాని మోదీ తొలిసారి ఏపీ పర్యటనకు రానున్నారు. గత వారం ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లిన సమయంలో తమ ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా కార్యక్రమ ప్రారంభానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. దీనికి ప్రధాని మోదీ సైతం అంగీకరించారు. అక్టోబర్ 15వ తేదీ దీనికి ముహూర్తంగా ఖరారు చేసారు. ఎన్నికలకు రెండేళ్ల ముందుగానేు పార్టీ ప్లీనరీలో పార్టీ అధినేత జగన్ నాడు వైయస్సార్ రైతు భరోసా ప్రకటించారు. రైతుకు రూ. 12,500 వేలు ఇచ్చేలా ప్రకటన చేసారు. దీంతో పాటుగా అదే రోజున అనేక ఇతర పధకాల ప్రారంభానికి ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇక, వచ్చే నెల నుండి జిల్లాల్లో పర్యటనలు చేయాలని ముఖ్యమంత్రి జగన్ డిసైడ్ అయ్యారు. మంత్రులు..ఎమ్మెల్యేలు ప్రజల్లోనే ఉండాలని సీఎం అదేశించారు.

రైతు భరోసా ప్రారంభానికి ప్రధానికి ఆహ్వానం..
సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగన్..ప్రధాని మోదీకి ఏపీకి రావాలని ఆహ్వానించారు. ఏపీలో నవరత్నాల్లో భాగంగా ప్రకటించిన వైయస్సార్ రైతు భరోసా పధకం ప్రారంభానికి రావాల్సిందా గత వారం ఢిల్లీ పర్యటనలో ప్రధానితో సమావేశమైన సీఎం జగన్ ఆహ్వానించగా ..ప్రధాని అంగీకరించారు. అక్టోబర్ 15న రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ప్రారంభిస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. రైతు భరోసా కింద రైతుకు ఏడాదికి రూ. 12,500 పెట్టుబడి సాయం కింద అందించనున్నారు. అయితే, ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ లో ప్రతీ రైతుకు ఏడాది కి రూ 6000 సాయం అందించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే, ఇప్పుడు కేంద్రం ఇస్తున్న సాయంతో పాటుగా ఏపీ ప్రభుత్వం మరో రూ.6,500 కలిపి రైతులకు అందివ్వనుంది. దీంతో.. పధకం ప్రారంభోత్సవానికి ప్రధానిని సైతం పిలవాలని జగన్ నిర్ణయించారు. ప్రధాని మోదీని ఆహ్వానించగా..వస్తానంటూ ఆయన హామీ ఇచ్చారు. ఏపీలో అధికారంలోకి వచ్చి మూడు నెలలు పూర్తి కానుండటంతో ఆగస్టు 15న గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించనున్నారు. అదే విధంగా ఇతర పధకాల అమలు షెడ్యూల్ ను ముఖ్యమంత్రి ప్రకటించారు.

ప్రభుత్వ పధకాల షెడ్యూల్ ఇలా...
ఆగస్ట్ 15 న గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థను సీఎం జగన్ విజయవాడలో ప్రారంభిస్తారు. మిగతా అన్ని నియోజకవర్గాలు, మండలాల్లో అక్కడి ఎమ్మెల్యేలు, మండల స్థాయి అధికారులు ప్రారంభిస్తారు.
ఆగస్ట్ 16 నుంచి 23 వరకు ప్రతి గ్రామం, వార్డుకు కేటాయించిన ఇళ్ళకు సంబంధించి వలంటీర్లకు అవగాహన కల్పిస్తారు. ఆగస్టు 26 నుంచి 30 వరకు గ్రామాల్లో ఇళ్ల పట్టాలు లేని లబ్ధిదారుల కోసం సర్వే చేస్తారు. సెప్టెంబరు 1 నుంచి సెప్టెంబరు 10 వరకూ బియ్యం, పెన్షన్లు డోర్ డెలివరీ చేస్తారు. పైలట్ ప్రాజెక్టుగా నాణ్యమైన, ప్యాకేజ్ చేసిన బియ్యం పంపిణీని శ్రీకాకుళంలో ప్రారంభిస్తారు. తర్వాత మిగతా జిల్లాలకు వర్తింపజేస్తారు. ఈ ఏడాది చివరి నాటికి అన్ని జిల్లాల్లో నాణ్యమైన ప్యాకేజ్డ్ బియ్యం అందుబాటులోకి వస్తాయి. సెప్టెంబరు 11 నుంచి 15 వరకూ పెన్షన్లు, రేషన్కార్డులు, ఇళ్లస్థలాలు, రైతు భరోసా లబ్ధిదారులను వలంటీర్ల గుర్తిస్తారు. సెప్టెంబర్ 15 నుండి 30 వరకు పథకాల అమలు తీరుపై శిక్షణ, సమీక్ష ఉంటుంది. అక్టోబర్ 2న గ్రామ, వార్డు సచివాలయాలని సీఎం ప్రారంభిస్తారు. శ్రీకాకుళం, విజయనగరంలో రేషన్ డోర్ డెలివరీ ప్రారంభిస్తారు. అక్టోబర్ 2 నుంచి ప్రతి రోజూ ప్రజా సమస్యల పరిష్కారానికి స్పందన కార్యక్రమం నిర్వహిస్తారు. 60 నుంచి 65 ఏళ్ల వయస్సు ఉన్నవారికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేస్తారు.

సెప్టెంబర్ 2 నుండి సీఎం జిల్లాల యాత్ర..
దివంగత ముఖ్యమంత్రి తన పధకాల సమీక్ష కోసం రచ్చబండకు వెళ్తూ 2009, సెప్టెంబర్ 2న వెళ్తూ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. ఇప్పుడు తన తండ్రి ప్రయాణం ఎక్కడైతే ఆగిపోయిందో.. అక్కడ నుండి తాను కొనసాగించాలని సీఎం జగన్ నిర్ణయించారు. సెప్టెంబర్ 2న ముఖ్యమంత్రి జగన్ జిల్లాల వారీగా రచ్చబండ ప్రారంభించనున్నారు. ఆ నెల మొత్తం అన్ని జిల్లాల్లో రచ్చబండ ద్వారా పధకాల సమీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. నవరత్నాల అమలు..లబ్దిదారులకు పధకాలు అందుతున్న తీరు.. గ్రామ స్థాయిలో సమస్యలు తెలుసుకోవాలని నిర్ణయించారు. ఆగస్టు మొత్తం పధకాల అమలు కోసం ప్రజల మధ్యే ఉండాలని డిసైడ్ అయ్యారు. దీంతో..ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత..ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో తిరిగి ప్రజల్లోకి వెళ్లనున్నారు.












Click it and Unblock the Notifications