క్రాంతి కూల్డ్రింక్ షాప్ ఎవరిది?: నేనా పని చేస్తే చంద్రబాబు బతికి ఉండేవారా?: కొడాలి నాని ఫైర్
విజయవాడ: పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మరోసారి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనదైన శైలిలో చెలరేగిపోయారు. తనను బూతుల మంత్రి అంటూ దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యల పట్ల కొడాలి నాని భగ్గుమన్నారు. తాను నిజంగానే బూతులు తిడితే దేవినేని ఉమామమహేశ్వర రావు గానీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గానీ బతికి ఉండేవారా? అని ప్రశ్నించారు. దేవినేని ఉమా మహేశ్వరరావు మైసూర్ మహారాజు కుమారుడిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

ఉచిత విద్యుత్పై అపోహలు..
శుక్రవారం ఆయన వైఎస్ఆర్పీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, వల్లభనేని వంశీతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉచిత విద్యుత్ విషయంలో తెలుగుదేశం పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. ఒక్క కనెక్షన్ కూడా తొలగించబోమంటూ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనలను కూడా టీడీపీ నేతలు తప్పుపడుతున్నారని ధ్వజమెత్తారు. ఉచిత విద్యుత్ సరఫరా చేసినందుకు డిస్కమ్లకు చంద్రబాబు చెల్లించాల్సిన బకాయిలను తమ ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు.

వైఎస్ మానస పుత్రిక అది.. దాన్ని రద్దు చేస్తామా?
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మానస పుత్రికగా గుర్తింపు పొందిన ఉచిత విద్యుత్ పథకాన్ని ఆయన బొమ్మ పెట్టుకున్న తమ ప్రభుత్వం ఎలా రద్దు చేస్తుందని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ నేతలకు ఆ మాత్రం కూడా పరిజ్ఙానం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వంటి దళారి నేతల మాటలను రైతులు ఎవరూ నమ్మొద్దని కోరారు. మీటర్లు బిగిస్తే రైతులకు ఎలా అన్యాయం జరగుతుందో వివరించే దమ్ము చంద్రబాబుకు ఉందా అని నిలదీశారు. చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా అదే పనిగా దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చేది లేదు..
రైతులు ఎంత విద్యుత్ను వినియోగించుకున్నా దానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు. 73 రోజులు ఆసుపత్రిలో రిమాండ్లో ఉన్న ఖైదీ ఈ భూప్రపంచంలో అచ్చెన్నాయుడు తప్ప ఇంకెవరైనా ఉన్నారా? అని కొడాలి నాని చురకలు అంటించారు. ఆసుపత్రిలో ఎవరైనా ఇన్నిరోజుల పాటు రిమాండ్లో ఉంటారా? అని అన్నారు. 2024 ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ మరింత బలహీనపడుతుందని జోస్యం చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చేది లేదు, చచ్చేది లేదని కొడాలి నాని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా తెలుగుదేశానికి ఓటమి తప్పదని అన్నారు.

కంచికచర్లలో క్రాంతి కూల్డ్రింక్ షాప్ ఎవరిది?
దేవినేని ఉమ తనను లారీ డ్రైవర్గా చెబుతున్నారని, ఆయన తండ్రి ఏం చేసేవారో మరిచిపోయినట్టున్నారని ఎదురుదాడికి దిగారు. గుడివాడలో తమ కుటుంబానికి 50 లారీలు ఉన్నాయనే విషయం అందరికీ తెలుసునని అన్నారు. దేవినేని ఉమామహేశ్వర రావు తండ్రి దేవినేని చిన్ని.. కంచికచర్లలో క్రాంతి కూల్డ్రింక్ షాప్ను నడిపేవారని చెప్పారు. ఆ షాప్లో దేవినేని ఉమా గోలీసోడాలను కడిగేవాడని ధ్వజమెత్తారు. దేవినేని ఉమా తానేదో మైసూరు మహారాజా కుమారుడిలా మాట్లాడటం సరికాదని అన్నారు. రాజకీయ వారసత్వం కోసం దేవినేని ఉమా తన వదినను చంపారనికొడాలి నాని విమర్శించారు.

ఎన్టీ రామారావు వల్లే రాజకీయాల్లోకి..
దేవినేని ఉమాకు తాను చెప్పాల్సింది చాలా ఉందని, ఆయనకు ఎన్ని ఫోన్ కాల్ చేసినా ఎందుకు లిఫ్ట్ చేయట్లేదని అన్నారు. తనను బూతుల మంత్రిగా ప్రచారం చేస్తున్నారని, నిజంగా తాను బూతులే మాట్లాడితే.. దేవినేని ఉమ, ఆయన నాయకుడు చంద్రబాబు నాయుడు బతికి ఉంటారా? అని ప్రశ్నించారు. తనకు రాజకీయ బిక్ష పెట్టింది చంద్రబాబు కాదని, ఎన్టీ రామారావు అనే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నానని అన్నారు. అందుకే నందమూరి కుటుంబం పట్ల తనకు కృతజ్ఙత ఉందని కొడాలి నాని చెప్పారు. చంద్రబాబే పెద్ద భిక్షగాడని.. తనకు ఆయన రాజకీయ భిక్ష పెట్టడమేంటని చెప్పారు.












Click it and Unblock the Notifications