ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... అక్కడ వారం రోజులు సంపూర్ణ లాక్ డౌన్...
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆగస్టు 3 నుంచి 9 వరకు సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు.టాస్క్ఫోర్స్ కమిటీ నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. లాక్ డౌన్ పీరియడ్లో ఉదయం 6గం. నుంచి రాత్రి 9గం. వరకు మాత్రమే నిత్యావసరాల కొనుగోళ్లకు అనుమతిస్తామన్నారు.
లాక్డౌన్ పీరియడ్లో అన్ని వ్యాపారాలు మూసివేయబడుతాయని,బస్సులు,ఆటోలు,బైక్స్ కూడా రోడ్లపై తిరగరాదని చెప్పారు. పట్టణానికి వారం రోజుల పాటు పూర్తిగా రాకపోకలు నిలిపివేస్తున్నామన్నారు. కేవలం రైతులు,వ్యవసాయ కూలీలకు మాత్రమే పనులకు అనుమతి ఉంటుందని... వాళ్లు సచివాలయంలో పేర్లు నమోదు చేయించుకోవాలని చెప్పారు.

బక్రీద్ పండుగ నేపథ్యంలో ముస్లిం సోదరులు ఇళ్లల్లోనే నమాజ్ చేసుకోవాలని పేర్ని నాని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా 60 ఏళ్ల పైబడ్డవారు,చిన్నపిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దన్నారు.
లాక్ డౌన్కు ప్రజలంతా సహకరించాలని.. నిబంధనలు ఉల్లంఘించినవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకోవడంలో పోలీసులకు పూర్తి స్వేచ్చనిస్తున్నామన్నారు.
కాగా,రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. బుధవారం(జూలై 29) ఒక్కరోజే రాష్ట్రంలో 10,093 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,20,390కి చేరింది. ఇప్పటివరకూ 55,406 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అవగా.. ప్రస్తుతం 63,771 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24గంటల్లో మొత్తం 70,584 కరోనా పరీక్షలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications