ఏపీ రాజకీయాల్లో కరోనా వైరస్ ... వైసీపీ వర్సెస్ టీడీపీ
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకరి మీద ఒకరు కరోనా వైరస్ తో పోలుస్తూ విమర్శలు చేసుకుంటున్నారు. ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్దమే కాదు కరోనా వైరస్ పేరుతో ట్వీట్ వార్ కూడా ఆసక్తికరంగా కొనసాగుతోంది. నువ్వానేనా అన్నట్టు టీడీపీ, వైసీపీలు కరోనా వైరస్ తో ఆటాడుతున్నారు.

కరోనా వైరస్ ను రాజకీయాలకు ఆపాదిస్తూ విజయసాయి ట్వీట్
కరోనా వైరస్ ప్రబలుతున్న ఈ విపత్కర పరిస్థితుల్లో.. తుపానులను నియంత్రించగల అతీంద్రియ శక్తులున్న చంద్రబాబు నాయుడి వైపు ప్రపంచమంతా చూస్తోందని ట్వీట్ చేసి చర్చ రాజేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి . కరోనా వైరస్ బారినుంచి కాపాడేందుకు ఆయన ఏదో ఒకటి చేయకపోతే ఈ భూమ్మీద మనుషులెవరూ మిగలరని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా అందరూ ఆందోళన చెందుతున్నారంటూ' వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక దానికి సమాధానంగా టీడీపీ నేతలు కరోనా వైరస్ అయినా కంట్రోల్ చెయ్యొచ్చు కానీ జగనోరా వైరస్ ను కంట్రోల్ చెయ్యలేమని రివర్స్ ఎటాక్ చేశారు .

చంద్రబాబుని టార్గెట్ చేసిన విజయసాయిపై రివర్స్ ఎటాక్
తుఫాన్లను నియంత్రించగల అతీంద్రియ శక్తులు ఉన్నది ఒక్క వైఎస్ కుటుంబానికే ఉంది విజయసాయిరెడ్డిగారు అన్నారు బుద్దా వెంకన్న . ఈ విషయం లో బావ సహాయం తీసుకోమని జగన్ కు సలహా ఇవ్వండి .గతంలో ఎన్నో విపత్తులు ఆపిన అనుభవం ఆయనకు ఉంది అన్నారు. కరోనా వైరస్ నుంచి ప్రజలను రక్షించేందుకు శాస్త్రవేత్తలు మందు తయారు చేస్తారు.కానీ 8 నెలలుగా ఏపీ ప్రజలను పట్టి పీడిస్తున్న జగరోనా వైరస్ కి మాత్రం ఖచ్చితంగా చంద్రబాబుగారు మాత్రమే మందు తయారు చేస్తారు సాయి రెడ్డి గారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఎల్లో వైరస్.. చైనాలోని కరోనా వైరస్ కంటే ప్రమాదకరం అన్న కొడాలి నానీ
ఇక ఇదే సమయంలో కొడాలి నానీ కూడా తనదైన స్టైల్ లో పంచ్ వేశారు .రాష్ట్రంలో ఎల్లో వైరస్.. చైనాలోని కరోనా వైరస్ కంటే ప్రమాదకరంగా పరిణమించిందని, ఎల్లో మీడియాకు సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏ మాత్రం కనిపించడం లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని టీడీపీపై విరుచుకుపడ్డారు. . ప్రభుత్వంపై ఓ వైపు ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుంటే.. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

జగన్ కరోనా వైరస్ ను రద్దు చేస్తారని విజయసాయిపై గోరంట్ల వెటకారం
విజయసాయి రెడ్డి చాలా వ్యంగ్యంగా యావత్ ప్రపంచమంతా చంద్రబాబు వైపు చూస్తోంది. తుఫాన్లను ఆపగలిగే సత్తా వున్న చంద్రబాబు కరోనా వైరస్ని కూడా నియంత్రించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరుతోంది అంటూ చేసిన ట్వీట్ పై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు.చంద్రబాబు అధికారంలో వుండి వుంటే కరోనా వైరస్ని కంట్రోల్ చేసేందుకు కనీసం ప్రయత్నం అయినా చేసే వారు. అదే జగన్ అధికారంలో వున్నారు కాబట్టి అలాంటి ప్రయత్నం ఏమీ చేయకుండా రద్దు చేస్తారు కదా అంటూ రిప్లై ఇచ్చారు గోరంట్ల. ఇక ఒకర్ని మించి ఒకరు డోస్ పెంచి కరోనా వైరస్ తో కలిపి చేస్తున్న విమర్శలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. భయంకర వైరస్ని కూడా వదలకుండా పాలిటిక్స్ కి వాడుతున్న నేతల తీరుపై అసహనం వ్యక్తం అవుతుంది .












Click it and Unblock the Notifications