విజయవాడలో కలకలం.. కరోనా లక్షణాలతో జీజీహెచ్లో చేరిన యువకుడు..
దేశాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ఎప్పుడు ఎక్కడ పాజిటివ్ కేసు నమోదవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా ఏపీలోని విజయవాడలో ఓ యువకుడికి కరోనా వైరస్ సోకినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తీవ్ర జ్వరం,జలుబు,దగ్గు వంటి లక్షణాలు కనిపించడంతో వెంటనే జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అతను ఇటీవలే జర్మనీ నుంచి విజయవాడకు వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం జీజీహెచ్ ప్రత్యేక వార్డులో ఉంచి అతనికి చికిత్స అందిస్తున్నారు. కరోనా నిర్దారణ కోసం శాంపిల్స్ని తిరుపతికి పంపించనున్నారు.
Recommended Video
ఇటీవల దక్షిణ కొరియా నుంచి స్వస్థలం తూర్పుగోదావరికి వచ్చిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి కూడా కరోనా సోకిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా అధికారులు అతన్ని కాకినాడలోని జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అతని కుటుంబ సభ్యులతో పాటు అత్తగారింట్లోని వారికి కూడా వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు.ఇక ఇటీవల కరోనా లక్షణాలతో తిరుపతి చేరుకున్న తైవాన్ చెన్ షి షన్ అనే వ్యక్తికి వైరస్ సోకలేదని వైద్య పరీక్షల్లో నిర్దారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో తిరుపతి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
దేశంలో ఇప్పటివరకు (మార్చి 4,2020) 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ అధికారిక ప్రకటన చేశారు. 12మంది భారతీయులు, 16మంది విదేశీయులకు కరోనా సోకిందన్నారు. భారత పర్యటనకు వచ్చిన 16 మంది ఇటలీ దేశీయులకు కరోనా సోకినట్టు నిర్ధారణ జరిగిందన్నారు. 14మంది పర్యాటకులను తీసుకెళ్లిన డ్రైవర్కు కూడా కరోనా సోకిందని చెప్పారు. ఢిల్లీలో 14మందికి, జైపూర్లో ఇద్దరికి చికిత్స అందిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 80కు పైగా దేశాల్లో 93వేల కేసులు నమోదయ్యాయి. దాదాపు 3500 పైచిలుకు మంది మృతి చెందారు. చైనా తర్వాత ఇటలీ,ఇరాన్,అమెరికా,దక్షిణ కొరియాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. దక్షిణ కొరియాలో బుధవారం ఉదయం మరో 516 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5328కి చేరింది.