మండలి ఛైర్మన్ తేల్చేసారు: సెలెక్ట్ కమిటీకి బిల్లు..రద్దు పైనా: ఏం చేయబోతున్నారు..!
ఏపీ ప్రభుత్వం మండలి రద్దు దిశగా అడుగులు వేస్తోంది. మరి..మండలిలో ఛైర్మన్ నిర్ణయించిన విధంగా బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్తాయా. రెండు రోజుల క్రితం మండలి ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలతో భిన్న వాదనలు. సోమవారం ప్రభుత్వం మండలి పైన ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది..ఈ చర్చల నడుమ మండలి ఛైర్మన్ షరీఫ్ వీటి పైన స్పందించారు. ఆ రోజు సభలో తాను తీసుకున్న నిర్ణయం గురించి వివరించారు. తనకు ఉన్న అధికారాలను వివరించారు. మండలి రద్దు పైన మాత్రం తాను స్పందించలేనని స్పష్టం చేసారు. మండలిలో ఘనతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన ఛైర్మన్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మొత్తంగా బిల్లు వ్యవహారంలో ఆయన ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసారు.
సెలెక్ట్ కమిటీకి బిల్లు..రెండు రోజుల్లో కమిటీ
మూడు రాజధానులు..సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లు వ్యవహారంలో ఏపీ శాసన మండలి ఛైర్మన్ షరీఫ్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. దీని పైన ఏపీ ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్ గా ఉంది. ఛైర్మన్ తాను చేసేది తప్పు అని చెబుతూనే..విచక్షణాధికారంతో నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. నేరుగా ముఖ్యమంత్రి జగన్ ఇదే అంశం పైన శాసనసభా వేదికగా తన అభ్యంతరం వ్యక్తం చేసారు. దీంతో.. ఏకంగా శాసనమండలి అవసరం లేదని..రద్దు చేయాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. దీని పైన మండలి ఛైర్మన్ షరీఫ్ స్పందించారు. తాను మండలిలో ఇచ్చిన రూలింగ్ కు అనుగుణంగానే రెండు బిల్లు లను సెలక్ట్ కమిటీకి పంపిస్తామని స్పష్టం చేసారు. రెండు రోజుల్లోనే సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రెండు బిల్లులు మండలి కస్టడీలోనే ఉన్నాయని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో మండలి రద్దు అంశం పైన మాత్రం స్పందించటానికి ఛైర్మన్ షరీఫ్ నిరాకరించారు. తాను నిబంధనల మేరకే నడుచుకున్నానని స్పష్టం చేసారు.

మూడ్ ఆఫ్ ది హౌస్ మేరకే నిర్ణయం..
తాను సభలో తీసుకున్న నిర్ణయం మెజార్టీ మేరకే తీసుకున్నానని షరీఫ్ వ్యాఖ్యానించారు. మూడ్ ఆఫ్ ది హౌస్ ను పరిగణలోకి తీసుకున్నానని వివరించారు. అయితే, ఇప్పుడు మండలి రద్దు అయితే సెలెక్ట్ కమిటీకి పంపించే బిల్లులు ఏమవుతాయనేది మాత్రం తాను చెప్పలేనని ఛైర్మన్ చెప్పుకొచ్చారు. రెండు రోజుల క్రితం ఛైర్మన్ చేసిన వ్యాఖ్యల పైన భిన్న వాదనలు వినిపించాయి. బిల్లులు సభలోనే ఆగిపోయా యని..సెలెక్ట్ కమిటీకి పంపటం పైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పటాన్ని రాజకీయ పార్టీలు ఎవరికి వారు తమకు అనుకూలంగా ప్రచారం చేసుకున్నారు. ఆ తరువాత దీని పైన షరీఫ్ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసారు. బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్తాయని తేల్చి చెప్పారు. మండలిలో రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన జెండా ఆవిష్కరించారు. ఇక, ప్రస్తుతం వివాదంగా మారిన సెలెక్ట్ కమిటీకి బిల్లుల విషయంలో తాను ఇచ్చిన రూలింగ్ మేరకే కమిటీకి బిల్లులు వెళ్తాయని షరీఫ్ స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications