జగన్ను ఎదుర్కొనే సత్తా వారాలబ్బాయ్కి ఉందా..లేదా?!
విజయవాడ: జనసేన పార్టీ- యువ శక్తి బహిరంగ సభ జోష్ లో ఉంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద సుమారు రెండు లక్షల మందితో ఈ సభను నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొనడానికి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బుధవారం రాత్రే విశాఖపట్నానికి చేరుకున్నారు. ఈ మధ్యాహ్నం రణస్థలానికి బయలుదేరి వెళ్లారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, నాగబాబు సహా పలువురు సీినియర్ నాయకులు ఇందులో పాల్గొననున్నారు.

సభ నేపథ్యంలో..
ఈ సభ నేపథ్యంలో పవన్ కల్యాణ్ పై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాటల దాడులు మొదలయ్యాయి. పలువురు పార్టీ సీనియర్ నాయకులు, మాజీమంత్రులు కౌంటర్ అటాక్ చేస్తోన్నారు. పవన్ కల్యాణ్ను వీకెండ్ పొలిటీషియన్ గా అభివర్ణిస్తోన్నారు. వారాలబ్బాయ్ గా ఎద్దేవా చేస్తోన్నారు. తన ఉనికిని చాటుకోవడానికే ఈ సభను ఏర్పాటు చేశారని, విశాఖపట్నాన్ని రాజధానిగా వ్యతిరేకిస్తోన్న పవన్ కల్యాణ్ కు ఉత్తరాంధ్రలో సభ నిర్వహించే హక్కు లేదనీ ధ్వజమెత్తుతున్నారు.

వెల్లంపల్లి విమర్శలు..
పవన్ కల్యాణ్ వైఖరి పట్ల దేవాదాయ శాఖ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. చంద్రబాబు కోసం పవన్ కల్యాణ్ రాజకీయాలు చేస్తోన్నాడని మండిపడ్డారు. ఏ పార్టీ అధ్యక్షుడైనా తన పార్టీ అధికారంలోకి రావాలని, తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాడని, పవన్ కల్యాణ్ మాత్రం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి తాపత్రయ పడుతున్నాడని విమర్శించారు.

175 చోట్ల పోటీ..
రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టే దమ్ము, ధైర్యం పవన్ కల్యాణ్ కు ఉందా? అని వెల్లంపల్లి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే సత్తా ఉంటే అన్ని స్థానాల్లోనూ పోటీ చేయాలని డిమాండ్ చేశారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల పేర్లు కూడా చెప్పలేని అసమర్థుడు పవన్ కల్యాణ్ అని ధ్వజమెత్తారు. కనీసం తన పార్టీలో 175 మంది నాయకుల పేర్లు కూడా చెప్పలేడని ఎద్దేవా చేశారు.

వారాహి ప్యాకేజీ విడుదల కోసమే..
తన వారాహి బస్సు యాత్ర ప్యాకేజీ కోసమే పవన్ కల్యాణ్- చంద్రబాబును కలిశాడని వెల్లంపల్లి ఆరోపించారు. ఏపీ రాజకీయాలకు పవన్ కల్యాణ్ ఓ ప్యాకేజీ స్టార్ మాత్రమేనని ఆయన తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రజలపై ఆయనకు ఏ మాత్రం ప్రేమ లేదని, ఉన్నదంతా ప్యాకేజీ, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమేనని విమర్శించారు. 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు తనను గాజువాక, భీమవరంలల్లో ఓడించారనే కోపం పవన్ కల్యాణ్ కు ఉందని, అలాంటి ఏపీ రాజకీయాలకు పనికిరాడని అన్నారు.

కులం చూడం, పార్టీ చూడం..
వైఎస్ జగన్ సారథ్యంలో అధికారంలో ఉన్న తమ పార్టీ కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా పాలన సాగిస్తోందని వెల్లంపల్లి అన్నారు. తనకు ఓటు వేయని వారికి అన్ని సౌకర్యాలు కట్ చేస్తానని గతంలో చంద్రబాబు హెచ్చరించారని, తాను వేసిన రోడ్ల మీద నడుస్తూ, తాను ఇచ్చిన కుళాయిల ద్వారా మంచినీళ్లను తాగుతూ, తాను ఇచ్చిన కరెంట్ ను వాడుకుంటూ తనకు కాకపోతే ఇంకెవరికి ఓటు వేస్తారని హెచ్చరించారని, 2019లో ఆయన చివరి ఎన్నికలు ముగిశాయని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications