'అప్పుడే జగన్ వ్యతిరేకత బయటపడింది.. రాజధాని తరలించడం సాధ్యం కాదు..'
ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకే వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకుంటోందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విమర్శించారు. ప్రజా వేదికను కూల్చినప్పుడే అమరావతిపై జగన్కు ఉన్న వ్యతిరేకత బయటపడిందన్నారు. రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారని,రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కాదని అన్నారు. రాజధానిపై నియమించిన కమిటీలన్నీ జగన్ స్క్రిప్టులనే చదివి వినిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. రాజధానిని తరలించడం సాధ్యం కాదని,రాజధాని అమరావతిలోనే కొనసాగాలని చింతమనేని డిమాండ్ చేశారు.
నగరిలో చిచ్చు.. రోజా ఆరోపణలు,కేసులపై సీఎం జగన్ రియాక్షన్ ఏంటి..?
మరోవైపు కర్నూలులోనే రాజధాని ఏర్పాటు చేయాలని రాయలసీమ కమిటీ డిమాండ్ చేస్తోంది. గతంలో రాజధానిని త్యాగం చేశామని.. ఇక్కడి ప్రజల ఆవేదనను అర్థం చేసుకుని రాజధానిని కర్నూలులోనే పునరుద్దరించాలని హైపవర్ కమిటీకి విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉంటే, స్థానిక సంస్థల ఎన్నికలు, మూడు రాజధానుల ప్రతిపాదనపై చర్చించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు జిల్లా ఇంచార్జి మంత్రులతో భేటీ కానున్నారు. ఎన్నికల పైనే ప్రధానంగా చర్చించనున్నప్పటికీ.. రాజధాని అంశంపై కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. మూడు రాజధానుల ప్రకటనపై జనం నుంచి వస్తున్న స్పందన,వ్యతిరేకతలపై చర్చించనున్నారు.
ఇక అటు అమరావతిలో రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు 21వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రహదారుల దిగ్బంధానికి జేఏసీ పిలుపునిచ్చింది. అయితే హైవేల దిగ్బంధానికి పోలీసులు అనుమతి లేదని చెప్పారు. అయినప్పటికీ రైతులు,టీడీపీ నేతలు రోడ్ల పైకి వచ్చేందుకు సిద్దపడటంతో భారీగా పోలీసులను మోహరించారు. ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, పుల్లారావు, పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్తో పాటు పలువురు జేఏసీ నేతలను హౌజ్ అరెస్ట్ చేశారు. శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తుంటే తమ పోరాటాన్ని అణచివేయాలనుకోవడం సరికాదని ఎంపీ గల్లా జయదేవ్ సహా పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు.