175 నియోజకవర్గాల్లో వైసీపీ గెలవడానికి హెల్ప్ చేస్తోన్న పవన్ కల్యాణ్..!!
విజయవాడ: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తాజాగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలు, ఆరోపణలపై ఎదురుదాడి మొదలైంది. పలువురు పార్టీ సీనియర్ నాయకులు, మాజీమంత్రులు కౌంటర్ అటాక్ చేస్తోన్నారు. పవన్ కల్యాణ్ను వీకెండ్, పార్ట్టైమ్ పొలిటీషియన్గా అభివర్ణిస్తోన్నారు. వారాలబ్బాయిగా ఎద్దేవా చేస్తోన్నారు. పవన్ కల్యాణ్ చేస్తోన్న విమర్శల్లో ఏ ఒక్కటీ సరైంది కాదని స్పష్టం చేస్తోన్నారు.
పవన్ కల్యాణ్ సవాల్..
పవన్ కల్యాణ్ ఇవ్వాళ మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. ఇప్పటంలో రోడ్ల విస్తరణలో భాగంగా నష్టపోయిన వారికి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఆవేశపూరితంగా ప్రసంగించారు పవన్. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లు గెలుస్తామంటూ వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తోన్నారని, వాళ్లు గెలుస్తూ ఉంటే తాము చూస్తూ కూర్చుంటామా అని ప్రశ్నించారు. 2024లో అధికారంలోకి వస్తామని, వైసీపీ నాయకుల ఇళ్లను తాము కూడా చట్టబద్ధంగానే కూలగొడతామని హెచ్చరించారు.
పవన్.. వారాలబ్బాయ్
పవన్ కల్యాణ్ చేసిన హెచ్చరికల పట్ల దేవాదాయ శాఖ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. పవన్ కల్యాణ్ ఓ వీకెండ్ పొలిటీషియన్ అని ఎద్దేవా చేశారు. వారాంతపు రోజుల్లో షూటింగ్ గ్యాప్లో ఇలా ఏపీకి వచ్చి వెళ్తుంటాడని చురకలు అంటించారు. పవన్ కల్యాణ్ ఏపీ ప్రజలకు వారాలబ్బాయ్గా కనిపిస్తోన్నాడని అన్నారు. ఇవ్వాళ ఆదివారం షూటింగ్ గ్యాప్ కావడం వల్ల ఏపీకి వచ్చాడని గుర్తు చేశారాయన. ఈ షూటింగ్ గ్యాప్లో ప్రజలు, మీడియాకు కనిపించే ప్రయత్నం చేస్తోన్నాడని అన్నారు.
కోర్టు కూడా మొట్టికాయ..
ఇప్పటం విషయంలో హైకోర్టు కూడా పవన్ కల్యాణ్కు మొట్టికాయ వేసిందని, అయినా గానీ ఆయనకు బుద్ధి రాలేదని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఇప్పటం ప్రజలకు అన్యాయం అంటూ ఏదైనా జరిగిందంటే అది పవన్ కల్యాణ్ వల్లేనని స్పష్టం చేశారు. 2019లో కూడా పవన్ కల్యాణ్ ఇలాగే సవాల్ విసిరి- తాను పోటీ చేసిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓడిపోయాడనే విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికైనా మారితే గానీ పవన్ కల్యాణ్ బాగుపడడని వ్యాఖ్యానించారు.
175 సీట్లల్లో గెలవడానికి..
పవన్ కల్యాణ్ గానీ, చంద్రబాబు నాయుడు గానీ 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలవలేరని వెల్లంపల్లి జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 175కు 175 అసెంబ్లీ నియోజకవర్గాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ గెలుస్తుందని తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాలను గెలవడానికి పవన్ కల్యాణ్ చేస్తోన్న రాజకీయాలు ప్రధాన కారణమౌతాయని ఆయన వ్యాఖ్యానించారు.
పాకుడు యాత్ర చేసినా..
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ తలపెట్టిన పాదయాత్ర వల్ల టీడీపీకి ఎలాంటి మేలు కలగబోదని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. పాదయాత్ర చేసినా, పాకుడు యాత్ర చేసినా నారా లోకేష్ కూడా ఎమ్మెల్యేగా గెలవలేడని పేర్కొన్నారు. తన తండ్రి ముఖ్యమంత్రిగా పని చేసిన ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ మంగళగిరి వంటి నియోజకవర్గంలో ఓడిపోయాడంటే నారా లోకేష్ కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చని చెప్పారు.
జగన్ నిలబెట్టిన అభ్యర్థిపై..
నారా లోకేష్ గానీ, పవన్ కల్యాణ్ గానీ.. వైఎస్ జగన్ ఎన్నికల్లో నిల్చోబెట్టిన అభ్యర్థి చేతిలో మట్టికరిచారని, అలాంటి వాళ్లు జగన్నే ఎదిరిస్తామని, ఆయనతోనే ఢీ కొడతామని అనడం హాస్యాస్పదమని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ ఇద్దరు జగన్ను ఓడిస్తామంటూ ప్రకటనలు చేస్తోంటే రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారాయన.