నాడు-నేడు కార్యక్రమంలో కార్పోరేట్ సంస్థలు: ఆ పాఠశాలలు అప్పగింత: ప్రభుత్వంతో ఒప్పందం..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన నాడు-నేడు లో కార్పోరేట్ సంస్థలు భాగస్వామ్యమయ్యాయి. కనెక్ట్ టు ఆంధ్రా కింద 5 కార్పొరేటు సంస్థలు నాడు-నేడుకు తోడ్పాటు అందించనున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. పాఠశాల విద్యాశాఖ గుర్తించిన 2,566 ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు కింద అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ అయిదు కార్పోరేట్ సంస్థలకు వారికి ఆసక్తి ఉన్న ప్రాంతాల్లో పాఠశాలల అభివృద్ధి బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.
సీఎం జగన్ భద్రతకు ఆక్టోపస్ టీమ్: మూడు రాజధానుల ప్రకటన చేసిన మరుసటిరోజే భద్రత పెంపు
నాడు -నేడులో కార్పోరేట్ సంస్థలు..
ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన నాడు - నేడు కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు అయిదు కార్పోరేట్ సంస్థలు ముందుకు వచ్చాయి. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. వసుధ ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ ఎం వెంకట రామరాజు, లారస్ ల్యాబ్స్ సీఈఓ చావా సత్యనారాయణ, హెటిరో డ్రగ్స్ ఎండీ వంశీకృష్ణ, రెయిన్ కార్బన్ సీజీఎం ఆదినారాయణ స్వామి, సీఎఫ్ఎం జీఆర్ కుమార్, ఆదిలీల ఫౌండేషన్ నేషనల్ ప్రెసిడెంట్ ఎస్ ఆదినారాయణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నవారిలో ఉన్నారు. వీరికి వారు పాఠశాలలను అభివృద్ధి చేయాలని ఆసక్తితో ఉన్న ప్రాంతాల్లోని స్కూళ్ల బాధ్యతలను అప్పగించారు. వారికి అప్పగించిన పాఠశాలల్లో ఇంగ్లిషు ల్యాబ్, 9 రకాల సదుపాయాలు కల్పించే విధంగా ఒప్పందం జరిగింది.
ఏ సంస్థ..ఎక్కడ స్కూళ్ల బాధ్యతంటే..
హెటిరో సంస్థ 402 పాఠశాలల బాధ్యత స్వీకరించింది. వైఎస్సార్ కడపలో చక్రాయపేట, జమ్మలమడుగు, లింగాల, పులివెందుల, సింహాద్రిపురం, తొండూరు, వేంపల్లి, వేముల మండలాల్లో పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ఆ సంస్థ రూ. 20 కోట్లకు పైగా ఖర్చుచేయనుంది. అదే విధంగా.. 428 ప్రభుత్వ పాఠశాలల బాధ్యత వసుధ ఫార్మా స్వీకరించింది. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, పాలకోడేరు, పోడూరు, వీరవాసరం మండలాల్లో పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ఆ సంస్థ దాదాపు రూ. 21 కోట్లు ఖర్చు చేయనుంది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 359 ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు లారస్ ల్యాబ్స్ రూ. 18 కోట్లు ఖర్చు చేయనుంది. కంచికచర్ల, వేలేరుపాడు, పెదకూరపాడు, తెనాలి, దుగ్గిరాల, ప్రత్తిపాడు మండలాల్లో పాఠశాలల్లో ఆ సంస్థ నాడు-నేడు చేపట్టనుంది.
కర్నూలు..శ్రీకాకుళం జిల్లాల్లో..
ఇక, రెయిన్ కార్బన్ సంస్థ 66 ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనుంది. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలంలో పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ఆ సంస్థ రూ. 1.65 కోట్లు ఖర్చు చేయనుంది. ఆదిలీల ఫౌండేషన్ 281 ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ది చేయనుంది. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి, పాతపట్నం, సారవకోట మండలాల్లో పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ఆ సంస్థ రూ. 25 కోట్లు ఖర్చుచేయనుంది. అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు తలా ఒక చేయి వేయాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. నాడు-నేడు కార్యక్రమం గురించి ఇతర సంస్థలకు చెప్పాలని.. తద్వారా అందరూ భాగాస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయా కార్పొరేటు సంస్థలకు ముఖ్యమంత్రి సూచించారు.