అమరావతిలో మొదటిసారి 30 అడుగుల ఎకో ఫ్రెండ్లీ గణేష్ ... కన్నా ఆధ్వర్యంలో నవరాత్రులు
వినాయక చవిత ఉత్సవాలకు సమయం దగ్గర పడుతోంది .ఎక్కడ చూసినా గణేష్ మండపాల ఏర్పాట్ల హడావుడి కనిపిస్తుంది. ఇక విగ్రహాల తయారీలో బిజీ బిజీగా ఉంటున్నారు విగ్రహాల తయారీ దారులు. ఇప్పటికే కొనుగోలు చేసి వినాయక చవితి కి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు గజానన మండల కమిటీలు. పండుగలు, సంప్రదాయాల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాల్సిన ఈ తరుణంలో వినాయక చవితి ఉత్సవాల్లో కాలుష్యానికి తావు లేకుండా పర్యావరణహిత గణపతులను పూజించాలనే నినాదం గత కొంతకాలంగా వినిపిస్తుంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరం లో మొట్టమొదటిసారి పర్యావరణ హిత గణపతిని ప్రతిష్టించి నవరాత్రి వేడుకలు చేయనున్నారు .
కన్నా లక్ష్మీనారాయణ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా గణేశ నవరాత్రి వేడుకలు
ఒకపక్క రాజధాని అమరావతి పై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో అమరావతి రోడ్ లో గణేష్ నవరాత్రి వేడుకలు అట్టహాసంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా ఈసారి నవరాత్రి వేడుకలు నిర్వహించనున్నారు. కన్నా ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా 30 అడుగుల పర్యావరణ గణపతిని ప్రతిష్టించి, పూజలు నిర్వహించనున్నారు. ఇప్పటికే తయారైన పర్యావరణ గణపతి విగ్రహాన్ని కమిటీ సభ్యులు సందర్శించడం తో పాటుగా, అక్కడ భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

రాజధాని నగరంలో రెండు వేల మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేయనున్న ఉత్సవ కమిటీ
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు పర్యావరణానికి హాని కలిగించే పాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను కాకుండా మట్టి గణనాధులనే పూజించాలనే నినాదంతో ఆగస్టు 31వ తేదీన ఈ కమిటీ ఆధ్వర్యంలో రెండు వేల మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు గా ప్రకటించారు. పర్యావరణ మట్టి గణపతినే పూజించాలని కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలోని గణేష్ ఉత్సవ కమిటీ పేర్కొంది. ఈ ఏడాది నుండి ప్రారంభించనున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రతి ఏడాది రాజధాని నగరంలో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.

గంగానది మట్టితో విగ్రహ తయారీ చేశారన్న కన్నా ... నవరాత్రి వేడుకలు ఎకో ఫ్రెండ్లీగా నిర్వహించాలని పిలుపు
ఇక గుంటూరులో పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాజధాని నగరంలో 30 అడుగుల మట్టి వినాయకుడిని ఏర్పాటు చేసినట్లుగా తెలిపిన కన్నా లక్ష్మీనారాయణ, ఈ విగ్రహ తయారీకి గంగానది నుండి మట్టిని తెచ్చినట్లు గా పేర్కొన్నారు. ఇక అంతే కాదు విగ్రహానికి సహజసిద్ధమైన రంగులు మాత్రమే వినియోగిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. తొమ్మిది రోజుల పాటు జరిగే నవరాత్రి ఉత్సవాల్లో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా అందరు గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవాలని కన్నా లక్ష్మీనారాయణ కోరారు.












Click it and Unblock the Notifications