బోటు బయటకు తియ్యలేని జగన్ సీఎంగా రాజీనామా చెయ్యాలంటున్న మాజీ మంత్రి హర్షకుమార్
గోదావరి నదిలో కచ్చులూరు వద్ద జరిగిన ఘోర బోటు ప్రమాద ఘటనలో బోటును ఇంకా వెలికి తీయక పోవడంపై మాజీ మంత్రి హర్షకుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా గోదావరి బేసిన్ లో ఓ ఎన్ జీ సి , రిలయన్స్ వంటి చమురు నిక్షేపాలను వెలికితీసే సంస్థలు ఉన్న నేపథ్యంలో వారి వద్ద ఉన్న సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించి బోట్ ను బయటకు తీయడం పెద్ద కష్టం కాదని వ్యాఖ్యానించారు.
బోటులో లోపాలు ఉన్న కారణంగా, ఇందులో అధికారుల పాత్ర ఉన్న నేపథ్యంలో బోటు ను వెలికి తీయకుండా ఏపీ ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. సముద్ర గర్భం నుండి చమురును, గ్యాస్ ను వెలికి తీస్తున్న సంస్థలు ఉన్న కృష్ణా గోదావరి బేసిన్ లో గోదావరిలో మునిగిన బోటును తీయలేక పోవడం ఏపీ సర్కార్ అసమర్ధతకు నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కావాలనే అధికారులు బోటును బయటకు తీయడానికి పలువురు నిపుణులు ప్రపోజల్ ఇచ్చినా, కావలసిన వనరులు సమకూరిస్తే రెండు గంటల్లో బోటును బయటకు తీస్తానని పశ్చిమగోదావరి జిల్లా పసివేదల కు చెందిన గొల్ల వెంకట శివ అనే వ్యక్తి పలుమార్లు చెప్పిన పట్టించుకోలేదని ఆయన విమర్శలు గుప్పించారు.

రెండున్నర నుండి 5 కిలోమీటర్ల లోతు వరకు రోబోట్లను పంపించే టెక్నాలజీ కృష్ణా గోదావరి బేసిన్ లో ఉన్నప్పటికీ ఆ టెక్నాలజీని ఎందుకు ఉపయోగించలేదంటూ హర్షకుమార్ ప్రశ్నించారు. బోటు ప్రమాద ఘటన జరిగి 13 రోజులు అవుతున్నా బోటును వెలికి తీయలేకపోతున్న అసమర్థ సీఎం జగన్మోహన్ రెడ్డి అని మండిపడిన ఆయన వెంటనే జగన్ సీఎంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా బోట్ ను వెలికితీయాలని డిమాండ్ చేశారు. బోటు వెలికితీసే అసలు విషయాలు బయటకు వస్తాయని ఆయన పేర్కొన్నారు. బోటులో 93 మంది ఉన్నట్టు పేర్కొన్న ఆయన మరోమారు వైసిపి సర్కార్ పై విమర్శల వర్షం కురిపించారు . బోటు ప్రమాద ఘటనపై మరోమారు ఆరోపణలు చేసిన హర్ష కుమార్ గోదావరి నదిలో మునిగిపోయిన బోటును బయటకు తీయాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేనట్టు కనిపిస్తోందని విమర్శించారు.












Click it and Unblock the Notifications