పరిషత్ ఎన్నికలపై హైకోర్టులో ముగిసిన వాదనలు-2.15కు హైకోర్టు తీర్పు
ఏపీలో రేపు జరగాల్సిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిలిపేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ఎస్ఈసీ నీలం సాహ్నీ దాఖలు చేసిన పిటిషన్ను డివిజన్ బెంచ్ విచారించింది. ఉదయం ప్రారంభమైన విచారణ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. అనంతరం వాద, ప్రతిపాదనలు విన్న హైకోర్టు మధ్యాహ్నం 2.15 గంటలకు తీర్పు వెలువరించబోతోంది.
పరిషత్ పోరుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ఎస్ఈసీ దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ డివిజన్ బెంచ్ ముందు విచారణకు వచ్చింది. ఎస్ఈసీ దాఖలు చేసిన ఈ అత్యవసర పిటిషన్పై ఉదయం 11గంటలకు విచారణ ప్రారంభమైనా ఎస్ఈసీ తరఫు న్యాయవాదులు ఎన్నికల నోటిఫికేషన్ వివరాలను సమగ్రంగా సమర్పించలేదు. దీంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరికి వారిని మధ్యాహ్నం 12 గంటల కల్లా సమగ్రంగా వివరాలు ఇవ్వాలని కోరింది.
ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి విచారణ ప్రారంభమైంది. ముందుగా ఎస్ఈసీ తరఫు న్యాయవాది సీవీ మోహన్రెడ్డి వాదనలు వినిపించారు. ఓసారి ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇచ్చాక అందులో కోర్టులు జోక్యం చేసుకోలేవని ఆయన వాదించారు. అనంతరం పిటిషనర్ వర్ల రామయ్య తరఫున న్యాయవాది వేదుల వెంకట రమణ వాదనలు వినిపించారు. ఎస్ఈసీ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పట్టించుకోకుండా నోటిఫికేషన్ ఇచ్చారని, అందుకే దీన్ని రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. చివరిగా ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరాం సుబ్రమణ్యం వాదనలు వినిపించారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యాక ఎన్నికలు నిలిపేయడం వల్ల సమయం వృధా అవుతుందని, ఇప్పటికే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు జరిగాయని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో వాదనలు ముగిశాయి. పిటిషనర్లు, ప్రతివాదనలు విన్న హైకోర్టు మధ్యాహ్నం 2.15కు తీర్పు రిజర్వు చేసింది.